14 రోజుల తర్వాత చిక్కిన అన్నాడీఎంకే నేత.. అదుపులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా...
సాప్ట్వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. సరిగ్గా 14 రోజుల క్రితం చెన్నైలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ప్లెక్సీ పడటంతో కిందపడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో టెకీ మృతి వీడియో వైరలైంది.
ఇదీ నేపథ్యం
ఈ నెల 13న సుభశ్రీ అనే సాప్ట్వేర్ ఇంజినీర్ తన స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో మెట్రో పిల్లర్కు కట్టిన ప్లెక్సీ ఒక్కసారిగా ఊడి వచ్చి ఆమె స్కూటీపై పడింది. దీంతో ఆమె కూడా వాహనంతో పడిపోయారు. ఆ సమయంలో శుభశ్రీకి హెల్మెట్ కూడా లేదని పోలీసులు చెప్తున్నారు. వెంటనే ఓ వాంటర్ ట్యాంకర్ వాయువేగంతో దూసుకొచ్చింది.
వెంటాడిన మృత్యువు
ఆమె పడిందో లేదో వాటర్ ట్యాంకర్ రూపంలో మృత్యువు వచ్చింది. ట్యాంకర్ కింద పడి శుభ్ర శ్రీ నుజ్జునుజ్జయిపోయింది. ఆమె చనిపోయారని తెలిసి పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్లెక్సీ పెట్టింది జయగోపాల్ అని తెలియడంతో విమర్శల జడివాన కురిసింది.
ప్రాణం తీసిన ప్లెక్సీ
జయగోపాల్ కుమారుడు పల్లవరన్ వివాహం ఖరారైంది. ఈ సందర్భంగా తోరపక్కం రాడికల్ రహదారిపై ప్లెక్సీని ఏర్పాటు చేశారు. 14 రోజుల క్రితం అదీ ఊడిపడిపోవడంతో.. శుభశ్రీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ప్రమాద ఘటన సీసీటీవీలో రికార్డైంది. తర్వాత వీడియో తెగ వైరలైంది. ఫ్లెక్సీ అన్నాడీఎంకే నేతదని తెలియడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. 14 రోజుల తర్వాత కృష్ణగిరి జిల్లాలో జయగోపాల్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటికొస్తూ ..
చెన్నైలోని క్రోమ్పెట్కు చెందిన శుభశ్రీ సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆఫీసుకెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం కబళించింది. ప్రమాద సమయంలో ఆమె హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు చెప్తున్నారు. శుభశ్రీ మృతితో ఆమె పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే వాటర్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.