ఫోన్ చేసి మందు పార్టీకి పిలిచారు: బెంగళూరులో టెక్కీ దారుణ హత్య, ఫ్రెండ్ మాయం !
ఫోన్ చేసి మందు పార్టీకి ఆహ్వానించడంతో వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు: ఫోన్ చేసి మందు పార్టీకి ఆహ్వానించడంతో వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసోం నుంచి బెంగళూరు చేరుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రణయ్ (24) అనే యువకుడు హత్యకు గురైనాడు.
బెంగళూరు నగరంలో ప్రసిద్ధి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రణయ్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితుడు ప్రణయ్ కు ఫోన్ చేసి మడివాళ సమీపంలోని తావరకెరెలో మందు పార్టీ ఏర్పాటు చేశామని, వెంటనే రావాలని చెప్పాడు.
స్నేహితుడు పిలిచాడని ప్రణయ్ నమ్మకంతో ఒంటరిగా వెళ్లాడు. తావరకెరె మెయిన్ రోడ్డులోని చాక్లెట్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రణయ్ మీద కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేశారు. సోమవారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చెయ్యగా హత్యకు గురైయ్యింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రణయ్ అని వెలుగు చూసింది. ప్రణయ్ కు ఫోన్ చేసి పిలిచిన వ్యక్తి మాయం అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. ప్రణయ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.