తల్లిని చూద్దామని ఇండియా వచ్చిన టెక్కీ: ఇంట్లోకి అడుగుపెట్టి షాక్ తిన్నాడు!
తల్లి ఆశాసహానీ(63)తో గడపాలని వచ్చిన ఆ టెక్కీకి కుళ్లిపోయిన స్థితిలో ఆమె శవం కనిపించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
ముంబై: ఇండియాలో ఉన్న తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చి ఓ టెక్కీకి ఊహించని సంఘటన ఎదురైంది. తల్లితో గడపాలని వచ్చిన ఆ టెక్కీకి కుళ్లిపోయిన స్థితిలో ఆమె శవం కనిపించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ముంబైలోని అంధేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆశాసహానీ(63) అనే వృద్ధురాలు అంధేరీలోని లోఖంద్వాల కాంప్లెక్స్ లో ఒంటరిగా నివసిస్తోంది. భర్త చనిపోవడం.. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో.. ఆమె ఒంటరిగానే ఉంటోంది. ఇదే క్రమంలో ఆదివారం తల్లిని చూసేందుకు రితురాజ్ అమెరికా నుంచి ముంబైకి వచ్చాడు.
అయితే ఎంతసేపు ఇంటి బెల్ కొట్టినా తల్లి మాత్రం తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన రితురాజ్.. కీ మేకర్ సహాయంతో తలుపు తీయించి ఇంట్లోకి ప్రవేశించాడు. అలా లోపలికి వెళ్లగానే కుళ్లిపోయిన స్థితిలో తల్లి శవం కనిపించింది. తల్లిని అలా చూసి రితురాజ్ కుప్పకూలిపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. వృద్ధురాలు ప్రమాదవశాత్తు మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.