5కి.మీ వెంబడించి మరీ..: ఆనవాళ్లు చెప్పిన టెక్కీ లావణ్య, దాడి వాళ్ల పనేనా?
చెన్నై: చెన్నైలో తెలుగమ్మాయి ఒకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. విధులు ముగించుకుని స్కూటీపై బయలుదేరిన సమయంలో.. కొంతమంది దుండగులు ఆమెను అడ్డగించి తలపై రాడ్డుతో మోది స్కూటీతో పరారయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలి నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు.
ఎవరా అమ్మాయి?
బాధితురాలిని ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంకి చెందిన లావణ్య(26)గా గుర్తించారు. చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో ఆమె పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున కంపెనీ విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి స్కూటీపై బయలుదేరారు.
అక్కడే దారిదోపిడీ:
లావణ్య అరసన్కళని రోడ్డు సమీపానికి రాగానే.. ఓ దారి దోపిడీ ముఠా ఆమె తలపై ఇనుప రాడ్డుతో మోదడంతో, ఆమె ఒక్కసారిగా కిందపడిపోయారు.
స్పృహ కోల్పోయిన లావణ్య నుంచి నగలు, డబ్బు, సెల్ఫోన్, బైక్ దోచుకుని దుండగులు పరారయ్యారు. కిందపడ్డ సమయంలో.. రోడ్డు పక్కనే ఉన్న ఓ బండరాయి లావణ్య తలకు బలంగా తాకడంతో తీవ్ర రక్త స్రావమైనట్టు తెలుస్తోంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు.
వాళ్లే.. దాడి చేశారా?:
లావణ్యపై దాడి కేసును విచారిస్తున్న పోలీసులు.. కొన్ని ఆధారాలు సేకరించారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక వైన్ షాపు ముందు లావణ్య బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం సేవించేందుకు వచ్చి స్కూటీ అక్కడే వదిలివెళ్లినట్టు గుర్తించారు. దీంతో ఆ యువకులే లావణ్యపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
5కి.మీ వెంబడించారని..:
ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లావణ్య చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ఆమె స్పృహలోకి రాగా.. పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించాలనుకున్నారు. కానీ తలకు బలమైన గాయమైనందువల్ల.. ఆమెతో ఎక్కువ మాట్లాడించకూడదని వైద్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే నిందితులను గుర్తుపట్టే కొన్ని ఆనవాళ్లు, అలాగే ఐదు కి.మీ తనను వెంబడించి మరీ దాడి చేశారని బాధితురాలు కొద్దిపాటి సమాచారం అందించినట్టు తెలుస్తోంది.