ఇంటి ముందు వాహనాలు: తీయమన్నందుకు టెక్కీపై ఇటుకలు, ఇనుపరాడ్లతో దాడి
న్యూఢిల్లీ: తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలను అక్కడ్నుంచి తీసేయాలని చెప్పినందుకు ఓ టెక్కీని పక్కింటి వారు తీవ్రంగా కొట్టారు. ఇటుకలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దారుణ ఘటన న్యూఢిల్లీలోని షాపూర్ జాట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
తీవ్రగాయాలపాలైన బాధితుడు రాజీవ్ పవార్ను అతని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తన ఇంటికి వెళ్లే దారిని పూర్తిగా వాహనాలతో మూసివేయడంతో ఇబ్బందికరంగా ఉందని, వాటిని తొలగించాలని కోరడంతోనే తన పొరుగింటివారు దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.
వాహనాలను తన ఇంటి ముందు నుంచి తొలగించాలని కోరడంతోనే ఆగ్రహానికి గురైన తన పొరుగింటి వ్యక్తి శ్రవణ్ కుమార్, అతని బంధువులు తనపై ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేశాడని చెప్పాడు. అంతేగాక, తనను చంపుతానని బెదిరింపులకు గురి చేశాడని బాధితుడు రాజీవ్ తెలిపాడు.
కాగా, బాధితుడు రాజీవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో సిసి టీవీ ఫుటేజీని సేకరించి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడు శ్రవణ్ తోపాటు అతని ఐదుగురు బంధువులపై క్రిమినల్ నేరం కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు.