ప్రేమ: ఐటీ పార్క్ పైనుంచి దూకి టెక్కీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కందంచవాడిలోని ఐటీ పార్కులోని అయిదో అంతస్తు నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో వైఫల్యం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన టెక్కీని అరవింద్గా పోలీసులు గుర్తించారు. అతను తోరైపక్కంలోని మెట్టుకుప్పం నివాసి. అతని తండ్రి తమిళవలన్ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. తండ్రి తోరైపక్కం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాడు.
అరవింద్ ఐదో ఫ్లోర్ నుంచి పదకొండున్నర గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడని, ఉన్నట్టుండి పై నుంచి దూకేశాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అరవింద్ స్నేహితులను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.
అతను ఓ యువతిని ప్రేమించాడని, వారిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారని వారు చెప్పారు. దీంతో ప్రేమ వైఫల్యం కారణంగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.