లవర్స్ విహారయాత్ర: పెళ్లి కోసం గొడవ, దాడి చేసి ముఖం చెక్కేసి లోయలో పడేసిన టెక్కీ !
తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లో అదృశ్యం అయిన యువతి దారుణ హత్యకు గురై శవమై కనిపించింది. యువతిని విహారయాత్రకు పిలుచుకుని వెళ్లిన ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేశాడని కోయంబత్తూరు పోలీసులు చెప్పారు.
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లో అదృశ్యం అయిన యువతి దారుణ హత్యకు గురై శవమై కనిపించింది. యువతిని విహారయాత్రకు పిలుచుకుని వెళ్లిన ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేశాడని కోయంబత్తూరు పోలీసులు చెప్పారు. యువతిని హత్య చేసిన ప్రశాంత్ (26) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కోయంబత్తూరులోని సాయిబాబా కాలనీలోని వేలండిపాలయం కోవిల్ మేడులో నివాసం ఉంటున్న హైదర్ ఆలీ కుమార్తె రుక్సానా (21), శరణపట్టి ప్రాంతంలో నివాసం ఉంటుూ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ ప్రేమించుకున్నారు. ఈనెల 16వ తేదీని ఇంటి నుంచి బయటకు వెళ్లిన రుక్సానా అదృశ్యం అయ్యింది.
చివరి ఫోన్ కాల్
హైదర్ ఆలీ తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుక్సానా ఆచూకి కోసం పోలీసులు తీవ్రప్రయత్నాలు చేశారు. చివరికి ఆమె మొబైల్ నెంబర్ నుంచి ఎవరెవరికి ఫోన్ చేసింది అని పరిశీలించారు. చివరిసారిగా రుక్సానా ప్రశాంత్ కు ఫోన్ చేసిందని పోలీసుల గుర్తించారు.
విహారయాత్రలో పెళ్లి కోసం గొడవ
పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈనెల 16వ తేదీన ప్రశాంత్, రుక్సానా నిలగిరి జిల్లాలోని మెట్టుపాళయం, భవానీ నది దగ్గరకు వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత అక్కడ పెళ్లి చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ప్రశాంత్ పోలీసులకు చెప్పాడు.
ముఖం చెక్కేసి లోయలో పడేశాడు
విహారయాత్రకు వెళ్లిన సందర్బంలో సహనం కొల్పోయిన ప్రశాంత్ తన ప్రియురాలు రుక్సానా మీద దాడి చేశాడు. అదుపుతప్పిన రుక్సానా బండరాయి మీద పడటంతో తలకు తీవ్రగాయాలై మరణించింది. పోలీసులు పట్టుకుంటారనే భయంతో రుక్సానా ముఖం చెక్కేసి లోయలో పడేశానని ప్రశాంత్ నేరం అంగీకరించాడు.
లోయలో గాలించారు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోయలో గాలించి రుక్సానా మృతదేహాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. రుక్సానా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రశాంత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు.
నమ్మించి చంపేశాడు
పెళ్లి చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ వేసిన ప్రశాంత్ తమ కుమార్తె రుక్సానాను నిలగిరి జిల్లాకు తీసుకువెళ్లి పక్కా ప్లాన్ తో హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.