అమెరికాలో సోదరికి మెసేజ్, ఇదే నా చివరి రోజు, లేడీ టెక్కీ ఆత్మహత్య, భర్త, అత్త!
బెంగళూరు: వరకట్నం కోసం నిత్యం భర్త వేధింపులకు గురి చెయ్యడంతో జీవితంపై విరక్తిచెందిన లేడీ టెక్కీ అమెరికాలో ఉన్న సోదరికి ఇదే నా చివరికి రోజు, నా కుమారుడిని నీవే జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ పంపించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఒకే ఊరు
కర్ణాటకలోని కోలారు జిల్లాకు చెందిన రశ్మీ (28), అదే ప్రాంతానికి చెందిన సతీష్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సతీష్ మాన్యత టెక్ పార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా, రశ్మీ మహదేవపురలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నారు.
ఇష్టపడి పెళ్లి
రశ్మీ, సతీష్ ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడటంతో మూడు సంవత్సరాల క్రితం పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు. రశ్మీ, సతీష్ దంపతులకు 16 నెలల కుమారుడు ఉన్నాడు. రామమూర్తి నగరలోని కెంపేగౌడ రోడ్డులోని సైఫర్ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో సతీష్, రశ్మీ దంపతులు నివాసం ఉంటున్నారు.
భార్యను వదిలి వెళ్లాడు
శనివారం భార్య రశ్మీ, కుమారుడిని బెంగళూరులోని అపార్ట్ మెంట్ లో వదిలిపెట్టిన భర్త సతీష్ కోలారు జిల్లాలోని సొంత ఊరు వెళ్లాడు. శనివారం మద్యాహ్నం 12.30 గంటల సమయంలో రశ్మీ అమెరికాలో ఉన్న సోదరికి మొబైల్ లో మేసేజ్ పంపంచింది.
ఇదే నా చివరి రోజు
అమెరికాలో ఉన్న సోదరికి రశ్మీ ఇదే నా చివరి రోజు, నా కొడుకును నీవే జాగ్రత్తగా చూసుకో అంటూ మెసేజ్ పంపించింది. తరువాత కుమారుడిని నిద్రపెట్టిన రశ్మీ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలో ఉన్న రశ్మీ సొదరి బెంగళూరులోని మల్లేశ్వరంలో నివాసం ఉన్న తల్లి భాగ్యమ్మకు ఫోన్ చేసి వెంటనే వెళ్లి చూడాలని సూచించింది.
ఆందోళనతో తల్లి
రశ్మీ తల్లి భాగ్యమ్మ శనివారం 1.30 గంటల సమయంలో రామమూర్తినగరలోని అపార్ట్ మెంట్ దగ్గరకు చేరుకున్నారు. రశ్మీ అపార్ట్ మెంట్ కు తాళం వేసి ఉండటంతో పోలీసులు, కోలారులో ఉన్న అల్లుడు సతీష్ కు భాగ్యమ్మ సమాచారం ఇచ్చారు.
భర్త, అత్త వేధింపులు
పోలీసులు వచ్చి అపార్ట్ మెంట్ తలుపులు పగలగొట్టి చూడగా రశ్మీ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. భర్త సతీష్, అత్త గాయిత్రీ వరకట్నం కోసం వేధించడం వలనే రశ్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి భాగ్యమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు వారాలు ఉద్యోగానికి !
భర్త సతీష్ వేధింపులతో గత రెండు వారాల నుంచి రశ్మీ ఉద్యోగానికి వెళ్లలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రశ్మీ ఆత్మహత్యకు ఆమె భర్త సతీష్, అత్త గాయిత్రీ కారణం అని భాగ్యమ్మ ఫిర్యాదు చెయ్యడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.