ఎక్మో: జయలలితను కాపాడలేకపోయింది, ఈ టెక్కీకి పునర్జన్మ, దానిపైనే ఆధారం!
జయలలిత గుండె ఆగిపోయినప్పుడు ఎక్మో చికిత్స చేశారు. కానీ అది ఫలప్రదం కాలేదు. అదే సమయంలో చెన్నైలోని శ్రీనాథ్ అనే సాఫ్టువేర్ ఇంజినీర్కు ఇటీవల సక్సెస్ అయింది.
బెంగళూరు: దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గుండె ఆగిపోయినప్పుడు ఎక్మో చికిత్స చేశారు. కానీ అది ఫలప్రదం కాలేదు. అదే సమయంలో చెన్నైలోని శ్రీనాథ్ అనే సాఫ్టువేర్ ఇంజినీర్కు ఇటీవల సక్సెస్ అయింది.
సెప్టెంబర్ 22వ తేదీన ఆసుపత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత కోలుకున్నారు. చనిపోవడానికి ఒక రోజు ముందు ఆమె గుండె పని చేయడం ఆగిపోయింది. ఎక్మో ద్వారా ఆమెను కాపాడేందుకు ఎయిమ్స్, అపోలో వైద్యులు ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు.
జయలలిత డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. డిసెంబర్ 4 సాయంత్రం ఆమెకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జయకు గుండెపోటు వచ్చినప్పుడు ఎక్మో చికిత్స పేరు ప్రధానంగా వినిపించింది.
భర్తకు శశికళ ఝలక్, పోయెస్ గార్డెన్లోకి నో ఎంట్రీ!: వ్యూహమేనా?
గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు ఎర్రరక్త కణాల్లోకి ఆక్సిజన్ను పంపి కృత్రిమంగా శ్వాసనందించే విధానమే ఈ ఎక్మో. అయితే ఈ ఎక్మో చికిత్సకు కూడా జయలలిత స్పందించలేదు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే, ఇదే విధానం (ఎక్మో) ద్వారా శ్రీనాథ్ అనే సాఫ్టువేర్ ఇంజినీర్కు వైద్యులు ప్రాణం పోశారు. బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ రెండు రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు.
చికిత్సను అందిస్తున్న క్రమంలో శ్రీనాథ్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కుటుంబ సభ్యులు గాబరాపడ్డారు. వైద్యులు చివరి ప్రయత్నంగా ఎక్మో ద్వారా అతనికి కృత్రిమ శ్వాసనందించారు. ఎక్మో అతని విషయంలో విజయవంతమైంది.
శ్రీనాథ్కు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఈ ఆసుపత్రి ఇప్పటి వరకూ 500 మంది పేషెంట్స్కు ఎక్మో ద్వారా చికిత్స చేసింది. ఈ కేసుల్లో చాలా వరకూ విజయవంతమయ్యాయి.
ఎక్మో ద్వారా చికిత్సను అందించిన 24 గంటల్లో శ్రీనాథ్ గుండె సాధారణంగా కొట్టుకోవడం ప్రారంభించిందని వైద్యులు తెలిపారు. ఎక్మో విధానంపై మణిపాల్ ఆసుపత్రి డాక్టర్ హెచ్ సుదర్శన్ బలాల్ మాట్లాడారు. ఎక్మోని ప్రధానంగా రెండు విషమ పరిస్థితుల్లో ఉపయోగిస్తారన్నారు.
మొదటిది గుండె పని చేయడం ఆగిపోయినప్పుడు, రెండు మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు. ఈ రెండు సందర్భాల్లో రోగి శరీరంలోని కార్బన్డై ఆక్సైడ్ను తొలగిస్తూ, రక్తకణాల్లోకి ఆక్సిజన్ను పంపిస్తారన్నారు. అలా పంపినప్పుడు రోగి తిరిగి కోలుకోవడం అతని గుండె, మూత్రపిండాల పరిస్థితిపై ఆధారపడి ఉంటుందన్నారు.