16 ఏళ్ల బాలికపై 60ఏళ్ల వృద్దుడి అత్యాచారం... గర్భం దాల్చిన బాలిక.. చెత్తకుప్పలో నవజాత శిశువు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. కామవాంఛ తీర్చుకునేందుకు ఓ వృద్దుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. గర్భం దాల్చిన ఆ బాలిక ఇటీవలే శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం ఆ పసిగుడ్డును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయింది. స్థానికులు ఆ శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసుల విచారణలో పలు విస్తుపోయే బయటపడ్డాయి.
పోలీసులు ఏం చెప్తున్నారు...
పోలీసుల కథనం ప్రకారం... అక్టోబర్ 31న ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఉన్న ఓ చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఓ పసిగుడ్డును స్థానికులు గమనించారు. ఓ వస్త్రంలో ఆ నవజాత శిశువును చుట్టి అక్కడ పడేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో.. వెంటనే ఓ టీమ్ అక్కడికి వెళ్లి పరిశీలించింది. శిశువును ఆస్పత్రికి తరలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కీలక ఆధారాలు దొరికాయి.
చెత్తకుప్పలో నవజాత శిశువు...
ఓ టీనేజ్ యువతి(16) ఆ నవజాత శిశువును తీసుకొచ్చి చెత్త కుప్పలో పడేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దీంతో పోలీసులు ఆ మైనర్ బాలికను గుర్తించి విచారించారు. మొదట తనకేమీ తెలియదని చెప్పిన ఆ బాలిక... పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత అసలు నిజాలు బయటపెట్టింది. శిశువును పడేసిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఓ భవనం టెర్రస్పై శిశువుకు జన్మనిచ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరని.. ఎవరి సాయం లేకుండానే బిడ్డకు జన్మనిచ్చానని చెప్పింది.
8 నెలల క్రితం అత్యాచారం...
తమ ఇంటి సమీపంలో ఉండే 60ఏళ్ల ఓ వృద్దుడు 8 నెలల క్రితం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు వెల్లడించింది. అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని పేర్కొంది. తాను గర్భం దాల్చిన సంగతి,శిశువుకు జన్మనిచ్చిన సంగతి ఎవరికీ తెలియకూడదనే... ఎవరూ లేని చోట ప్రసవించి,బిడ్డను చెత్తకుప్పలో పడేసినట్లు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడగా... ఆమె గర్భం దాల్చిన సంగతి,శిశువుకు జన్మనిచ్చిన సంగతి తమకు తెలియదని చెప్పారు.
నిందితుడు అరెస్ట్...
గత కొద్ది నెలలుగా తన కుమార్తె శరీరంలో మార్పును గమనిస్తున్నానని ఆమె తల్లి చెప్పారు. దీనిపై బాలికను ఆరా తీయగా.. ఆమె తమతో ఏ విషయం చెప్పలేదన్నారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్దుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నవంబర్ 1న అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. బురారీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.