అబార్షన్ కోసం హైకోర్టుకు రేప్ బాధితురాలు
అహ్మదాబాద్: తనకు గర్భస్రావం చేసేందుకు అనుమతించాలని 18ఏళ్ల అత్యాచార బాధితురాలు బుధవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. జునాగఢ్ జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. గతేడాది సెప్టెంబరులో ఓ యువకుడు అత్యాచారం చేయడంతో.. మానసిక క్షోభను తట్టుకోలేక ఆమె యాసిడ్ తాగారు.
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం తన నోటితో ఏదీ తాగలేని, తినలేని పరిస్థితికి ఆమె చేరుకున్నారు.
ప్రస్తుతం ఓ గొట్టం ద్వారా నేరుగా కడుపులోకే ఆమె ఆహారం తీసుకుంటున్నారు. దీనికితోడు ఇటీవలే తను గర్భవతి అనే విషయం అమెకు తెలిసింది. దీంతో తన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గర్భస్రావానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు.
ఆలస్యమైతే తన ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఫిబ్రవరి 19 నాటికి ఆమె మానసిక స్థితిపై నివేదిక సమర్పించాలని వైద్య అధికారికి కోర్టు సూచించింది. అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది.