గర్ల్ ఫ్రెండ్ విషయంలో విద్యార్థి హత్య
న్యూఢిల్లీ: అమ్మాయి విషయంలో యువకుడిని అతని స్నేహితులు అతి దారుణంగా కొట్టి చంపేసిన సంఘటన న్యూ ఢిల్లీలోని కంజూవాల పరిధిలో జరిగింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో నివాసం ఉంటున్న దీపక్ గూలియా (19) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు.
ఇతను సోన్ పేట్ లోని ప్రయివేట్ స్కూల్ లో ఇంటర్ చదువుతున్నాడు. స్కూల్ హాస్టల్ లోనే దీపక్ ఉంటున్నాడు. అదే స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్న 17 సంవత్సరాల బాలికతో దీపక్ చనువుగా ఉంటున్నాడు. ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ అని సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న దీపక్ స్నేహితులు (క్లాస్ మేట్స్) నిత్యం అతనితో గొడవపడుతున్నారు. తరువాత వేసవి సెలవులలో స్కూల్ హాస్టల్ మూసివేశారు. అప్పుడు అతని స్నేహితులు దీపక్ ను ఎలాగైనా అంతం చెయ్యాలని, ఆ అమ్మాయికి దూరం చెయ్యాలని ప్లాన్ వేశారు.
గత గురువారం ప్రశాంత్ విహార్ లో జరిగిన బర్త్ డే పార్టీకి దీపక్ వెళ్లాడు. అదే సమయంలో అతని స్నేహితులు దీపక్ ను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. తరువాత అతని మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో మరణించాడు.
మృతదేహాన్ని తీసుకు వెళ్లి మదనపూర్ సమీపంలోని గ్రామం దగ్గర విసిరి వేసి పరారైనారు. తన కుమారుడు ఇంటికి రాలేదని దీపక్ తండ్రి కృష్ణ గూలియా నరేలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బర్త్ డే పార్టీకి హాజరైన వారి ఫోన్ నెంబర్లు తీసుకుని విచారణ చేశారు.
చివరికి మదనపూర్ సమీపంలో యువకుడి మృతదేహాం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చెయ్యగా హత్యకు గురైయ్యింది దీపక్ అని వెలుగు చూసింది. హత్య చేసి పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.