సిక్కింలో పొంగి ప్రవహిస్తున్న తీస్తానది...ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన ప్రభుత్వం
సిక్కిం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు తీస్తానది పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు తీస్తానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోందని రాజధాని గ్యాంగ్టాక్లోని అధికారులు తెలిపారు. తీస్తా త్రీ చుంగ్తంగ్ వాటర్ రిజర్వాయర్ కూడా నిండిపోయిందని అధికారులు తెలిపారు. హిమాలయా పర్వత ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రం తరుచు సహజ విపత్తుల బారిన పడుతూ ఉంటుంది. ఇందులో భారీ వర్షాలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం లాంటి సహజ విపత్తులకు గురవుతూ ఉంటుంది.
తీస్తా నది కింద ఐదు డ్యాములు నిర్మితమై ఉన్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ డ్యాములు కాస్త ప్రమాదానికి గురవుతూ ఉంటాయి.ఇప్పటివరకు తీస్తా త్రీ డ్యాము నుంచి 600 క్యూసెక్కుల నీటిని అధికారులు లోతట్టు ప్రాంతాలకు విడుదల చేశారు. ఇక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే సహాయక బృందాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. పాక్యాంగ్లో వరదలు వచ్చే అవకాశం ఉండటంతో అక్కడి ఈ సహాయక బృందాలను దింపింది ప్రభుత్వం. ఇక అత్యవసర సేవలను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.
ఉత్తర సిక్కింలో దాదాపు 60 టూరిస్టు వాహనాలు ఇరుక్కునిపోయాయని జిల్లా కలెక్టర్ రాజ్యాదవ్ తెలిపారు.బస్సుల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించి ముందుగా లాచెన్కు తరలించి అక్కడి నుంచి గ్యాంగ్టక్కు తరలిస్తామని వెల్లడించారు. ఇక వాహనాల కోసం రహదారిని సరాళం చేయాల్సిందిగా అధికారులను సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్ గోలే ఆదేశించారు. నదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అధికార యంత్రాంగం తెలిపింది.అయితే నదీతీర ప్రాంతానికి మాత్రం వెళ్లకూడదని సూచించింది. రాష్ట్రంలోని తీస్తా నది తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.