పరిహాసమే, లైంగిక దాడి కాదు: తరుణ్ తేజ్పాల్
న్యూఢిల్లీ: తాను లైంగిక దాడికి పాల్పడలేదని, పరిహాసం కోసం సరదాగా అలా చేశానని మహిళా జర్నలిస్టుపై దాడి కేసులో నిందితుడైన తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్ కోర్టుకు చెప్పుకున్నాడు. ముందస్తు బెయిల్ కోసం పటిషన్ దాఖలు చేసిన తరుణ్ తేజ్పాల్ ఆ విధంగా చెప్పాడు. మహిళా జర్నలిస్టుపై తాను లైంగిక దాడికి ప్రయత్నించలేదని చెప్పుకున్నాడు.
అయితే, గత వారం యువతికి క్షమాపణలు చెబుతూ పంపిన ఈ మెయిల్ వాదనకు ఇది భిన్నంగా ఉంది. తాను సిగ్గుమాలిన అభిప్రాయానికి వచ్చి లైంగిక అనుసంధానం కోసం రెండు సార్లు ప్రయత్నించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ఆ ఈ మెయిల్లో అన్నారు.
సంఘటనను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురిపై విమర్శలు చేస్తూ మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను యాజమాన్యం ఆమోదించింది.
తనపై ముందస్తు పథకం ప్రకారం కుట్ర చేశారని తేజ్పాల్ ఆరోపించారు. తాను బిజెపి నేతల ఆగ్రహానికి బాధితుడిగా మారానని, గోవాలో బిజెపి ప్రభుత్వం ఉందని, గతంలో తాము బిజెపి నాయకుల అవినీతిని బయటపెట్టినందుకు తనపై కుట్ర చేశారని తేజ్పాల్ అన్నారు.