తెహెల్కా కేసు: విక్టిమ్ని బెదిరించలేదన్న షోమా
న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో బాధిత మహిళా జర్నలిస్టుపై అభాండాలు వేసినట్లు, ఆమెను బెదిరించినట్లు, ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఖండించారు. అదంతా విషప్రచారమని అన్నారు.
తాను ఆ విధమైన చర్యలకు పాల్పడినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించిన మహిళా జర్నలిస్టు తన రాజీనామా లేఖలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తేజ్పాల్, షోమా చౌదరి సంఘటనను కప్పిపుచ్చాలని చూస్తున్నారని, తనను బెదిరించే, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే, తనపై అభాండాలు వేసే చర్యలకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు.
నవంబర్ 7వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఉద్యోగం కల్పించిన వ్యక్తిగా తరుణ్ తేజ్పాల్ మాత్రమే కాదు, ఉద్యోగులు, జర్నలిస్టులు, స్తీరవాదులు ఉమ్మడిగా మహిళల విషయంలో విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, తరుణ్ తేజ్పాల్పై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేశారంటూ తరుణ్ తేజ్పాల్ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని, దాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా నిరూపించడానికి తరుణ్ తేజ్పాల్ పూనుకోవాలని ఆయన అన్నారు.