లైంగిక వేధింపు: తేజ్పాల్ అరెస్ట్, ఊసరవెల్లిలా అన్న పిపి
పనాజీ: మహిళా విలేకరిపై లైంగిక వేధింపుల కేసులో తెహెల్కా తేజ్పాల్ను గోవా పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. సహచర జర్నలిస్టుపై అత్యాచారం చేసాడన్న అభియోగం నేపథ్యంలో, తేజ్పాల్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ను స్థానిక కోర్టు తిరస్కరించిన అనంతరం గోవా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి తేజ్పాల్ ఉన్న గోవా క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోనే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.
వైద్య పరీక్షల అనంతరం 50 ఏళ్ల తేజ్పాల్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయనను కోర్టుకు హాజరుపరుస్తారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఇంటరాగేషన్ జరిపే సమయంలో రోజుకోసారి తన లాయరు సహాయం తీసుకోవడానికి తేజ్పాల్కు ఆయన బెయిలు పిటిషన్ను విచారించిన జడ్జి అనుజ ప్రభుదేశాయ్ అనుమతించారు.
అంతకుముందు తనను అరెస్టు చేయకుండా ఉండడానికి తేజ్పాల్ తన పాస్పోర్టును కోర్టుకు సమర్పించడానికి సంసిద్ధత తెలియజేసారు. ఆయన తన భార్య, కుమార్తెతో కలిసి కోర్టుకు వచ్చారు. దర్యాప్తు ఏజన్సీ కోరినంతకాలం తేజ్పాల్ గోవాలోనే ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు లాయరు చెప్పారు.
అయితే తేజ్పాల్పై ఒక కేసును పోలీసులు నమోదు చేసారని, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు అనుకుంటున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. తేజ్పాల్ పరువు ప్రతిష్ఠలన్నీ గాలిలో కలిసిపోయాయని, ఆయన కస్టడీలో ఉన్నంత మాత్రాన దానికి మరింత హాని ఏమీ కలగదని కూడా ఆయన అన్నారు. అంతేకాదు హోటల్లోని సిసి టీవీ దృశ్యాలు సైతం లైంగిక దాడిని ధ్రువీకరిస్తున్నాయని, బాధితురాలి నిజాయితీని ప్రశ్నించడం ద్వారా డిఫెన్స్ లాయరు పుండుమీద కారం చల్లారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, తేజ్పాల్ ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఇదిలా ఉండగా లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను కాంగ్రెస్ పార్టీ కాపాడడం లేదని కేంద్ర మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ అంటూ, ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. కాగా, తరుణ్ తేజ్పాల్ను న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.