తెహల్కా లైంగిక దాడి: విక్టిమ్ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ/పనాజి: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన మహిళా జర్నలిస్టు వాదనను పోలీసులు రికార్డు చేశారు. గోవా రాజధాని పనాజిలో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట బుధవారం ఉదయం 10.15 గంటలకు బాధిత జర్నలిస్టు తన వాదనను వినిపించారు. ఆ తర్వాత ఆమె మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లిపోయారు.
మంగళవారం రోజున బాధిత జర్నలిస్టు తన ఈ మెయిల్ ఖాతాను గోవా క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. ఎనిమిది గంటలపాటు బాధితురాలి ఈ మెయిల్ ఖాతాను పోలీసుల బృందం పరిశీలించింది. మంగళవారం సాయంత్రం కూడా బాధితురాలు నుంచి వాదనలను పోలీసులు రికార్డు చేశారు. కాగా గోవా కోర్టు ముందు బాధితురాలు తెలిపే వివరాలే ముఖ్యంగా ఉండనున్నాయని ఓ విచారణాధికారి ఒకరు తెలిపారు.
బుధవారం ఉదయం గోవాకు వచ్చిన బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు తన వాదనలను వినిపించింది. తేజ్పాల్ తనపై వేధింపులకు పాల్పడిన నాటి నుంచి తేజ్పాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు జరిగిన పరిణామాలను మొత్తం బాధితురాలు వివరించినట్లు సమాచారం.
హైకోర్టులో తేజ్పాల్ బెయిల్ పిటిషన్ విచారణ
తరుణ్ తేజ్పాల్కు సంబంధించిన అంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం మధ్యాహ్న సెషన్ తర్వాత విచారించనుంది. సుప్రీం కోర్టులో మరో కేసు విషయంలో తేజ్పాల్ న్యాయవాది బిజీగా ఉండడంతో కోర్టు మధ్యాహ్నం తర్వాత విచారించనుంది. బెయిల్ పిటిషన్ను సాయంత్రం 3.30 తర్వాత విచారించే అవకాశం ఉందని జస్టిస్ సునీత గుప్తా తెలిపారు.
విచారణలో జోక్యం చేసుకోను: గోవా సిఎం
మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ అరెస్టె అనివార్యం కావొచ్చని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. తేజ్పాల్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. విచారణలో తాను జోక్యం చేసుకోనని మనోహర్ పారికర్ తెలిపారు. కేసు విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. గోవా పోలీసులు విచారణ త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.