ఆర్జేడీలో చీలిక: కొత్త పార్టీ వైపు లాలూ పెద్ద కుమారుడి అడుగులు..?
పాట్నా: ఆర్జేడీలో చీలిక వస్తోందా... కొన్ని దశాబ్దాలుగా బీహార్ను ఏలిన పార్టీలో లుకలుకలు మొదలయ్యాయా..? ఒంటి చేత్తో నడిపించి ఊపిరి పోసిన పార్టీకి ఊపిరి తీసే ప్రయత్నం చేస్తున్నారా.. ఇందుకు లాలూ కుమారుడే స్కెచ్ గీశాడా... ఇంతకీ పార్టీలో ఏం జరుగుతోంది.. పెద్ద కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ నిర్ణయం ఏమిటి..? బీహార్ పాలిటిక్స్ ఎటువైపు వెళుతున్నాయి..?
ఆర్జేడీలో చీలిక షురూ..?
రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ.... బీహార్లో ముఖ్యమైన రాజకీయ పార్టీ. పార్టీ వ్యవస్థాపకులు బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఒంటిచేత్తో పార్టీని కొన్నేళ్లుగా నడిపిస్తున్నారు. ఒక్కసారిగా లాలూ జైలు పాలవడంతో ఎన్నికల వేళ పార్టీకి సరైన వ్యూహకర్తలు కరువయ్యారు. లాలూ రాజకీయవారసుడిగా ఆయన చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్ ఫోకస్ అవుతున్న సమయంలో పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అడ్డుగా నిలిచాడు. మొన్నటికి మొన్న తాను ఆర్జేడీ యూత్ వింగ్కు రాజీనామా చేశారు. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో తేజ్ప్రతాప్ యాదవ్
సరన్ లోక్సభ స్థానం నుంచి తేజ్ప్రతాప్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. తేజ్ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్వీ యాదవ్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ మధ్యే విడాకులు తీసుకున్న తన భార్య తండ్రి సరన్కు చెందిన చంద్రికా రాయ్ పై కూడా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక వైపు అయితే మరో వార్త కూడా వినిపిస్తోంది.
థాంక్యూ పీఎం సర్: ఆదేశంలోని ముస్లిం మహిళను కాపాడిన ప్రధాని మోడీ...ఏంటా కథ..?
సొంత పార్టీ వైపు తేజ్ ప్రతాప్ అడుగులు
తేజ్ప్రతాప్ యాదవ్ సొంత పార్టీని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ పేరు లాలూ రబ్రీ మోర్చా అని తెలుస్తోంది. అధికారికంగా అది నమోదు కానప్పటికీ బీహార్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుస్తోంది. దాదాపు 20 లోక్సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా నిలువనున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. సరన్ నుంచి తన తల్లి రబ్రీ దేవీ పోటీచేయాల్సిందిగా తాను కోరుతున్నానని అది సాధ్యం కానిచో స్వయంగా తనే ఆర్జేడీ అభ్యర్థిపై ఆ స్థానం నుంచి పోటీచేస్తానని తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పారు. సరన్ సీటు తన తండ్రిదని మరొక బయట వ్యక్తిని అక్కడి నుంచి పోటీచేయిస్తే ఊరుకుండేది లేదని తేజ్ప్రతాప్ తేల్చి చెప్పారు.
అన్నదమ్ముల మధ్య విబేధాలు..?
ఇక బెటయా, షియోహర్, జెహానాబాద్, హజీపూర్లలో లాలూ రబ్రీ ఫ్రంట్ పేరుతో తన అభ్యర్థులను బరిలో నిలుపుతానని చెప్పుకొచ్చారు తేజ్ప్రతాప్ యాదవ్. అయితే తన ఫ్రంట్ మాత్రం ఆర్జేడీతోనే ఉంటుందంటూ మరో మెలిక పెట్టారు. ఎన్నికలకు ముందు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇలా వ్యవహరించడంపై ఆర్జేడీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సీట్ల పంపకాల్లో భాగంగా ఇప్పటికే జెహానాబాద్, హజీపూర్ స్థానాలకు ఆర్జేడీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక బెటయా స్థానం ఆర్ఎల్ఎస్పీకి కేటాయించింది. పార్టీ పగ్గాలను లాలూ తన చిన్న కుమారుడు తేజస్వీయాదవ్కు అప్పగించినప్పటి నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి తేజ్ప్రతాప్ యాదవ్ నిర్ణయం ఆర్జేడీలో కలకలం రేపుతోంది. దీన్నే అధికార పక్షం ఆయుధంగా మలుచుకుంటోంది. అంతేకాదు ఆర్జేడీలో చీలికలు మొదలయ్యాయంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు ఇది వారికి కలిసొచ్చే అంశమని ఇది ఇలానే కొనసాగితే మహాకూటమిలో కూడా చీలికలు వస్తాయనే ఆశతో ఎన్డీఏ కూటమి ఉంది.