బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..
చివరికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారనే దానితో సంబంధం లేకుండా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజేతలుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ లు నిలిచారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తమ జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వం నుంచి అరకొర సహాయం అందినా బీహారీలు మోదీనే విశ్వసిస్తున్నట్లు ప్రస్పుటంగా చెప్పారు. బీహార్ ఎన్డీఏలో బీజేపీ స్థానాన్ని జూనియర్ భాగస్వామి నుంచి కమాండింగ్ పొజిషన్ లో మోదీ నిలబెట్టారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ, ప్రభావం మచ్చుకైనా దరిచేరనీయకుండా ఎన్నికల్లో తలపడిన యువకెరటం తేజస్వీ యాదవ్ తన ఆర్జేడీని రాష్ట్రంలోనే అతి పెద్ద పార్టీగా నిలబెట్టారు. ఈ రెండూ అంత ఈజీగా సంభవించిన మార్పులు కాదు..
Recommended Video
బీహార్: కొంపముంచిన 11సీట్లు -52 స్థానాల్లో తేడా 5వేల లోపే -అత్యధిక, అత్యల్ప మెజార్టీలివే
అద్వానీ 30 ఏళ్ల కల..
ఉత్తరాదిలో బీజేపీ సొంతగా గెలవలేని ఏకైక రాష్ట్రంగా బీహార్ ఇన్నాళ్లూ ఉండింది. 1991 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన వేళ.. ‘‘విజేత రెండో స్థానంలో నిలిచాడు'' అంటూ ఎల్కే అద్వానీ ఇచ్చిన స్టేట్మెంట్ చరిత్రలో నిలిచిపోయింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత అద్వానీ సూత్రీకరణను తిరగరాసుకునే సందర్భం వచ్చింది. గడిచిన మూడు దశాబ్దాలుగా బీహార్ లో జేడీయూకు జూనియర్ భాగస్వామిగా కొనసాగిన బీజేపీని మోదీ మంత్రాంగం కెప్టెన్ స్థాయికి చేర్చింది.. బీహార్ కోటాలో పాగా వేయాలన్న కమలనాథుల కలలన్ని మోదీ దాదాపు సుసాధ్యం చేశారు. బీజేపీ ప్రామిస్ చేసిన విధంగానే చీఫ్ మినిస్టర్ పోస్టును జేడీయూ చీఫ్ కు అప్పగించింది. కానీ అందుకు నితీశ్ కుమార్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది..
కమలం దెబ్బకు వంగిన బాణం
జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన సీఎం కుర్చీని కాపాడుకొని ఉండొచ్చుగాక, ఇవాళో రేపో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయొచ్చుగాక, ఈ ఎన్నికల్లో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకున్నది మాత్రం ఆయనే. 71 సీట్ల నుంచి 43 స్థానాలకు పడిపోవడం ద్వారా ఎన్డీఏ కూటమిలో సీనియర్ భాగస్వామి హోదాను కోల్పోవడమేకాదు, జేడీయూ ఓటు బ్యాంకు భారీ ఎత్తున బీజేపీకి షిఫ్ట్ అయినట్లు గణాంకాల్లో వెల్లడైంది. నిజానికి ఎన్డీఏ కూటమికి ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(సీఎంపీ) అంటూ ఏదీ లేదు. దీంతో ఎన్డీఏ ఉంటూనే ఆయా పార్టీలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించే వీలు ఏర్పడింది. ఇది మిగతావాళ్ల కంటే బీజేపీకే ఎక్కువ లాభం చేకూర్చింది. గడిచిన 3 దశాబ్దాలుగా దేశం నలుమూలలా బీజేపీతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు కాల క్రమంలో ఏ విధంగా క్రష్ అయిపోయింది విదితమే. ఇప్పటి వంతు జేడీయూది. బీహార్ లో కమలం దెబ్బకు జేడీయూ బాణం వంగిపోయింది. అంతేనా..
19 లక్షల ఉద్యోగాలు ఇస్తారా?
బీజేపీ ఇదే దూకుడు కొనసాగిస్తే బాణం పూర్తిగా విరిగిపోయి.. బీహార్ లో ఒంటరిగా కమలం వికసించే రోజు దగ్గర్లోనే ఉందని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. తేజస్వీ యాదవ్ ప్రచార సభలకు జనం భారీ ఎత్తున తరలిరావడం అధికార కూటమిలో కాస్త కలవరం రేపినా.. జనానికి నితీశ్ కుమార్ పై ఉన్న ప్రకోపమే తప్ప, మోదీ అంటే విముఖత కాదని ఫలితాల్లో తేలింది. విద్య, వైద్యం, ఉపాధి, నీటి పారుదలకు సంబంధించి తేజస్వీ ప్రజలముందు ఉంచిన అంశాలు చాలా కీలకమైనవే అయినా... వాటిని కాదని మరీ జనం మోడీ వైపు మొగ్గు చూపారు. మరి బీజేపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారో, సీఎం నితీశ్ కుమార్ కాబట్టి నెపం ఆయన మీదికి నెట్టేస్తారో కాలమే నిర్ణయిస్తుంది. అయితే..
బీహార్లో ఊపు -వెస్ట్ బెంగాల్పై చూపు -ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
విజేత రెండో స్థానంలో నిలిచాడు
రాబోయే కాలానికి బీహార్ తన నేతను తేజస్వీ యాదవ్ రూపంలో తయారు చేసుకుంది. ఎన్నికల ప్రారంభంలో నాన్-స్టార్టప్ రాజకీయ నేతగా అందరూ వదిలేసిన తేజస్వీ... ఫలితాల తర్వాత పోల్ స్టార్ గా నిలిచారు. తన పార్టీ సామాజిక కూర్పు పరిమితులను విస్తరించుకుంటూ, యాదవ్, ఇతర ఓబిసిలతో పాటు ముస్లింలకు కూడా పెద్ద సంఖ్యలో టికెట్లిచ్చి విస్తృత సామాజిక సంకీర్ణాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీ విఫలమై ఉండొచ్చు, కాంగ్రెస్ సాధ్యమైనంతలో కూటమి పుట్టి ఉంచి ఉండొచ్చు, కానీ నికరంగా చూస్తే తండ్రి లాలూ లేకుండా తొలిసారి తలపడిన ఎన్నికల్లోనే తేజస్వీ భారీగా లాభపడ్డారు. ‘‘విజేత రెండో స్థానంలో నిలిచాడు''అన్న అద్వానీ ఉవాచను తేజస్వీ కూడా గుర్తుపెట్టుకుంటే సరి.