భారీ ఊరట: ఐఆర్సీటీసీ కేసులో తేజస్వి యాదవ్కు బెయిల్ మంజూరు
ఢిల్లీ: ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవీ వారి కుమారుడు తేజస్వి యాదవ్కు , అవినీతి కేసులో బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ కోర్టు. లాలూ ప్రసాద్ యాదవ్ పెరోల్ సమయం ముగిశాక ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయాక వీరిద్దరికీ బెయిల్ మంజూరు కావడం విశేషం. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్జేడీకి, తేజస్వి యాదవ్కు ఊరట లభించినట్లయ్యింది.
బెయిల్ మంజూరు చేసేముందు జడ్జి కొన్ని నిమిషాల పాటు ఆలోచించారు. ఆ సమయంలో తేజస్వి యాదవ్ అతని తల్లి రబ్రీ దేవీలు కోర్టు హాలులోనే ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్ ఆయన రాజకీయ వారసుడిగా ప్రమోట్ అవుతున్నారు. తేజస్వి యాదవ్పై సీబీఐ అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేయడంతో సీఎంగా ఉన్న నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య విబేధాలు వచ్చాయి. ఆ తర్వాత జేడీయూతో ఆర్జేడీ తెగదెంపులు చేసుకుంది.
మూడు అవినీతి కేసుల్లో జైల్లో లాలూ ఉండగా... ఇక అప్పటి నుంచి ఆర్జేడీ కార్యకలాపాలన్నీ కొడుకు తేజస్వి యాదవే చూస్తున్నాడు. బీజేపీ నితీష్ ప్రభుత్వాలపై పలు వేదికల నుంచి టార్గెట్ చేస్తున్నారు కూడా. ఒకవేళ తేజస్వియాదవ్కు బెయిల్ మంజూరు కాకపోయి ఉంటే... వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమైంది. ఇదిలా ఉంటే జూలై 2017లో నితీష్ కుమార్ లాలూతో తెగదెంపులు చేసుకుని ఆ తర్వాత బీజేపీతో జతకట్టారు. ఆ సమయంలో తేజస్వియాదవ్ నితీష్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
2006లో లాలూ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు ఐఆర్సీటీసీ హోటళ్లు నడిపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందుకోసం ఆసంస్థ లాలూ ప్రసాద్ యాదవ్కు పాట్నాలో మూడెకరాల స్థలం ఇచ్చింది ఆ సంస్థ. ముందుగా ఆర్జేడీ ఎమ్మెల్యే భార్య పేరుపై ఆ స్థలం రాసిచ్చారు. ఆ తర్వాత రబ్రీదేవీ, తేజస్వియాదవ్ల పేరుపై బదిలీ చేశారు. అత్యంత తక్కువ ధరకే ఖరీదైన మూడెకరాల స్థలం కొట్టేశారనే ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా నితీష్ కోరారు. ఇందుకు ససేమిరా అన్నారు తేజస్వి యాదవ్. బీజేపీ తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ నితీష్ కుమార్ తేజస్విపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తాను కోర్టులోనే చెప్పాల్సింది చెబుతానని తేజస్వి అన్నారు. దీంతో నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక రోజు తర్వాత తిరిగి బీజేపీ మద్దతుతో సీఎం పీఠంపై కూర్చొన్నారు.