బీహర్లో మెదడువాపు విజృంభణ .. లండన్లో తేజస్వి షికార్లు .. కాదు కాదు ఢిల్లీలో ...
న్యూఢిల్లీ : బీహర్లో మెదడు వాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే .. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాత్రం పత్తాలేకుండా పోయారు. వ్యాధి సోకి పిల్లలు చనిపోయి .. తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాత్రం బాధితుల గోడు వినడం లేదు. ఆయన రాష్ట్రంలో లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారనే చర్చ జరుగుతుంది.
లండన్లో తేజస్వి ...?
తేజస్వి యాదవ్ గురించి మీడియా ఆర్జేడీ నేతను ప్రశ్నిస్తే రకరకాల సమాధానాలు చెప్పారు. తొలుత ఇంగ్లాండ్ వెళ్లారని .. ప్రపంచ కప్ మ్యాచ్ చూడటానికి అని పేర్కొన్నారు. అవునా అని గట్టిగా నిలదీసే సరికి తనకు సరిగా తెలియదని ఒకవేళ వెళ్లి ఉండొచ్చని అనుమానంగా చెప్పారు. మరో నేత ఢిల్లీలో ఉన్నారని .. పరువు నష్టం కేసు విచారణకు హాజరయ్యేందుకు హస్తినలోనే ఉన్నారని తెలిపారు. దీంతో తేజస్వి యాదవ్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్న ప్రస్తుతానికి సశేషంగా మిగిలిపోయింది.
పిల్లలు అల్లాడుతుంటే ..
ఇటీవల బీహర్లో చిన్నారులకు మెదడు వ్యాపు వ్యాధి సోకింది. వ్యాధి దాదాపు ఇప్పటికే వంద మందికి పైగా చిన్నారులు పిట్టల్లా రాలిపోయారు. తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ముజఫర్నగర్లో 300 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా .. 112 మందికి మెదడు వాపు ఉన్నట్టు నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. వారు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఏం చక్కా తిరుగుతున్నారు. ప్రపంచ కప్ వీక్షించడానికి లండన్ వెళ్లారని ఆ పార్టీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ పేర్కొన్నారు. అయితే తనకు కచ్చితంగా తెలియదని చెప్పి .. తప్పించుకునే ప్రయత్నం చేశారాయన. తేజస్వి లండన్ వెళ్లి ఉంటారని నేను ఊహించానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
హస్తినలో మకాం ..?
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరవుతానని ఇదివరకే తేజస్వి యాదవ్ తెలిపిన సంగతి తెలిసిందే. దీందో ఆయన దేశ రాజధానిలో ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే దీనిపై తేజస్వి కానీ, పార్టీ స్పందించకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీ అంతగా ప్రభావం చూపించలేదు. అందుకే ఆ పార్టీ నేతలు అందుబాటులో లేకుండా పోయారా అనే అనుమానం కూడా కలుగుతుంది. బీహర్లో ప్రస్తుతం మెదడు వాపు వ్యాధి విజృంభిస్తోంది. దీంతో శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను చూసేందుకు వెళ్లిన సీఎం నితీశ్ కుమార్కు కూడా నిరసన సెగ తగిలింది. సీఎం ఎదుటే .. బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటీవల ఢిల్లీ జరిగిన సమావేశానికి హాజరైన సీఎం నితీశ్ .. సోమవారం రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆ వెంటనే రాష్ట్రంలో మెదడు వాపు వ్యాధి విజృంభణ తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.