లాలూ పిల్లలపై నితీశ్ కామెంట్లు- తేజస్వీ స్ట్రాంగ్ కౌంటర్-మోడీని కూడా ఇరికిస్తూ...
బీహార్ తొలి దశ ఎన్నికలకు రేపు పోలింగ్కు జరగనున్న నేపథ్యంలో రెండో దశ ప్రచారంలోనూ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం నితీశ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతుండగానే... లాలూ వారసుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇందులో ఆయన ప్రధాని మోడీని కూడా లాగారు.
బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..
మగ పిల్లాడి కోసం ఎనిమిది, తొమ్మిది ఆడపిల్లలు కన్న కుటుంబం అంటూ లాలూ కుటుంబంపై సీఎం నితీశ్ కుమార్ తాజాగా విమర్శలు చేశారు. కూతుర్లపై నమ్మకం లేనందువల్లే కొడుకు కోసం ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లలను కన్నారని విమర్శించారు. ఇప్పటికే విపక్షంలోని మహాకూటమి పార్టీలతో పాటు మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నితీశ్.. ఒత్తిడిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నితీశ్ వ్యాఖ్యలపై విపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. నితీశ్ వ్యాఖ్యలకు తేజస్వీ ఇచ్చిన కౌంటర్ సైతం చర్చనీయాంశం అవుతోంది.
నితీశ్ కుమార్ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో మహిళలను, తన తల్లి సెంటిమెంట్ను అవమానించారని తేజస్వి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆరుగురు సోదరులు కలిగిన ప్రధాని మోడీని కూడా నితీశ్ టార్గెట్ చేసినట్లుందని తేజస్వి తెలిపారు. ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగం వంటి కీలక సమస్యలపై మాట్లాడకుండా తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడంపై తేజస్వీ విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారాయి. హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల మధ్య నితీశ్ - తేజస్వీ మాటల యుద్ధం కూడా ఆసక్తి రేపుతోంది.