తేజస్వి యాదవ్ గుడ్బాయ్ , భవిష్యత్ సీఎం! లాలూ వేలుపెడితే జంగిల్ రాజ్: ఉమాభారతి సంచలనం
భోపాల్/పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి గట్టిపోటీనే ఇచ్చింది. 10-15 సీట్ల తేడాతో అధికారానికి దూరమైంది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపడతారని బీజేపీ స్పష్టం చేయగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తేజస్వి యాదవ్పై ఉమాభారతి ప్రశంసలు
ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్పై బీజేపీ కీలక నేత, మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి ప్రశంసలు కురిపించారు. రానున్న కాలంలో తేజశ్వి మంచి నేతగా ఎదుగుతారని అన్నారు. ఎప్పటికైనా తేజశ్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అయితే, ఒకవేళ తేజశ్వి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా అధికారం మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలోనే ఉండేదని చెప్పుకొచ్చారు.
తేజస్వి మంచి నేత, సీఎం అవుతారు.. లాలూ వస్తే మళ్లీ జంగిల్ రాజ్..
భోపాల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయంపై మీడియాతో ఉమాభారతి మాట్లాడారు. ‘తేజశ్వి యాదవ్ చాలా మంచివాడు. అయితే, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదు. అందువల్ల తేజశ్వి అధికారం చేపట్టినా.. లాలూ ప్రసాద్ యాదవ్ చక్రం తిప్పి.. మళ్లీ జంగిల్ రాజ్ వైపు బీహార్ రాష్ట్రాన్ని తీసుకెళ్తారు. కొంత అనుభవం వచ్చాక తేజశ్వి రాష్ట్రాన్ని పరిపాలించగలడు' అని ఉమాభారతి వ్యాఖ్యానించారు.
నితీశ్ ఎన్డీఏకు నిచ్చెనలాంటివారు..
సీనియర్ ఎన్డీఏ భాగస్వామి జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం గురించి ఉమా భారతి మాట్లాడుతూ.., ఎన్డీఏ కూటమిలో తమ పార్టీ "పెద్ద అన్నయ్య"గా మారిందని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ "నిచ్చెన" గా ఉన్నారని తెలిపారు. ఆ నిచ్చెన ద్వారానే బీహార్లో అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. తాము ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందే చెప్పిన విధంగా బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో నితీశ్ కూర్చుంటారని స్పష్టం చేశారు. బీహార్ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారని మీడియా ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ విషయంలో మాట్లాడదల్చుకోలేదన్నారు.
Recommended Video
ఒంటి చేత్తో మహాకూటమిని ముందుకు నడిపించిన తేజస్వి యాదవ్..
కాగా, 31ఏళ్ల తేజస్వి యాదవ్ ఆర్జేడీని తాజా ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టారు. ఎన్డీఏ కూటమిలోని మహామహులతో పోటీపడి ప్రచారం నిర్వహించి బీహార్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తండ్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. ఆర్జేడీతోపాటు మహాకూటమి భారాన్ని భుజాలపై ఎత్తుకుని రాష్ట్రమంతా పర్యటించారు. ప్రజలు కూడా ఆశించిన స్థాయిలోనే తేజస్వి యాదవ్పై నమ్మకం ఉంచి ఓట్లు వేశారు. 243 స్థానాలు గల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ 110 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.