ఫలితాలనాడు రౌడీల్లా కాదు .. సంయమనంతో వ్యవహరించండి .. క్యాడర్ కు తేజస్వి వార్నింగ్
బీహార్ ఎగ్జిట్ పోల్ తర్వాత ఆర్జెడి క్యాడర్ కు తేజస్వి యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. ఫలితాల రోజున ఎవరితోనూ ఎలాంటి ఆందోళనకు దిగవద్దని, జాగ్రత్తగా ప్రవర్తించాలని, రౌడీల్లాగా ప్రవర్తించకూడదు అంటూ ఆయన హెచ్చరించారు. ఆర్జేడీ నేతృత్వంలోని గ్రాండ్ అలయన్స్ విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు రోజున ఫలితాలతో సంబంధం లేకుండా వేడుకలు, కాల్పులు , ప్రత్యర్థుల పట్లఅనాగరిక ప్రవర్తన కు వ్యతిరేకంగా పార్టీ తమ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చింది .
బీహార్ లో యూఎస్ తీర్పు రిపీట్ ..ఇక్కడ నమస్తే ట్రంప్ అంటే అక్కడ బైబై ట్రంప్ అన్నారు : శివసేన
నవంబర్ 10 న ఎన్నికల ఫలితాలు ఏమైనప్పటికీ, సంపూర్ణ సంయమనం అవసరం
పార్టీ తన కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ట్వీట్లో, "నవంబర్ 10 న ఎన్నికల ఫలితాలు ఏమైనప్పటికీ, సంపూర్ణ సంయమనం పాటించాలని, ప్రశాంతంగా కౌంటింగ్ కొనసాగేలా చూడాలని, ఫలితాలను మర్యాదగా అంగీకరించాలని పేర్కొంది. బాణసంచా కాల్చడం, వేడుకలలో తుపాకీలతో కాల్పులు జరపడం, ప్రత్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని హితవు పలికింది. లెక్కింపు రోజున మర్యాదగా ప్రవర్తించాలని హింసకు తావు లేకుండా చూడాలని పార్టీ కార్యకర్తలకు సూచనలు చేసింది.
బీహార్ లో ఎన్నికల సమయంలో రౌడీ కల్చర్ .. మార్చటానికి తేజస్వి యాదవ్ యత్నం
గతంలో ఎన్నికల ఫలితాల సందర్భాలలో బీహార్లో రౌడీయిజం జోరుగా సాగేది. ఇక ఆ సంస్కృతిని తొలగించి కొత్త సంస్కృతిని నెలకొల్పడానికి తేజశ్వి చేసిన ప్రయత్నాల్లో భాగం. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ 243 స్థానాలలో మహా కూటమి విజయం సాధిస్తుందని, మెజారిటీ స్థానాలు మహాకూటమికి దక్కుతాయని అంచనా వేశాయి. ఆర్జేడీ బీహార్ యూనిట్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను ఎలా వచ్చినా సరే సంయమనంతో స్వీకరించాలని, అందరూ అంగీకరించాలని పార్టీ సభ్యులకు చెప్పామన్నారు.
ప్రజా విశ్వాసం గెల్చుకోవటానికి తేజస్వి చాలా కష్టపడ్డారన్న నేతలు
తేజశ్వి యాదవ్ ను ప్రశంసిస్తూ సింగ్ మాట్లాడుతూ, "లాలూ ప్రసాద్ పై ఉన్న విశ్వాసం ఇంకా అలాగే ఉందని, తేజశ్వి పార్టీ ఏర్పాట్లు బలంగానే ఉన్నాయి అంటూ పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యొక్క సన్నిహితుడైన సింగ్ పార్టీ సభ్యులతో మాట్లాడుతూ, పార్టీపై ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవటానికి తేజశ్వి చాలా కష్టపడ్డాడు అన్నారు. ఇక ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం అంటూ పేర్కొన్నారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ గురించి దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతుందన్నారు.
Recommended Video
గొడవలొద్దు ... రౌడీయిజానికి స్వస్తి పలకాల్సిందే
తేజస్వి మద్దతుదారులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని ఎవరితో ఎలాంటి గొడవలు దిగవద్దని, రౌడీయిజానికి స్వస్తి పలకాలని ఆర్జెడి పిలుపునిచ్చింది. బీహార్ రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తేజస్వి యాదవ్ కార్యకర్తలకు కౌంటింగ్ రోజున ఎలా వ్యవహరించాలో సూచనలు చేసి వారికి దిశానిర్దేశం చేశారు. రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. 19 కంపెనీల పారా మిలటరీ బలగాలు బీహార్ కు భద్రత కల్పిస్తున్నాయి.