11 ప్రశ్నలు: ప్రధాని మోడీకి తేజస్వీ యాదవ్, ర్యాలీల నేపథ్యంలో కొశ్చన్స్
బీహర్ ఎన్నికల వేళ మాటల తుటాలు పేలుతున్నాయి. రేపు బుధవారం తొలి విడత పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. అయితే రెండో విడత జరిగే ఎన్నికల కోసం ప్రచారం కంటిన్యూ అవుతోంది. బుధవారం ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తోన్నారు. దర్బాంగ, ముజఫర్ నగర్, పాట్నాలో ర్యాలీ తీయనున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. 11 ప్రశ్నలతో మోడీకి సవాల్ విసిరారు.
ఎయిమ్స్ పనులు ఇప్పుడా..?
దర్బాంగలో ఎయిమ్స్ నిర్మిస్తామని హామీనిచ్చి.. 2020 ఎన్నికల ముందు ఎందుకు పనులు స్టార్ట్ చేశారని ప్రశ్నించారు. ముజఫర్ నగర్ షెల్టర్ హోం కేసు సంగతేంటి అని ప్రశ్నించారు. 34 మంది అనాధ చిన్నారులపై లైంగికదాడి జరిగితే చర్యలు తీసుకోరా అని ధ్వజమెత్తారు. దర్బాంగతోపాటు ముజఫర్ నగర్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి.. ఆ మాటే మరచిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు అక్కడ ఒక్క వైద్యుడిని కూడా నియమించలేదు అని చెప్పారు. స్కిల్ వర్సిటీ నిర్మిస్తామని హామీనిచ్చి ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు.
6 చెత్త నగరాలు బీహర్లోనే..
దేశంలో 10 చెత్త నగరాలు ఎంపికైతే అందులో 6 నగరాలు బీహర్లోనే ఉన్నాయని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీహర్ అభివృద్ధి సంగతి ఏంటీ అని అడిగారు. పాట్నా వర్సిటీకి ఇప్పటివరకు ఎందుకు సెంట్రల్ వర్సిటీ హోదా ఇవ్వలేదు అని అడగారు. రాష్ట్రంలో ఉన్న మెజార్టీ యువత ఎందుకు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది అని అడిగారు. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..? 15 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని ప్రశ్నించారు.
Recommended Video
వలసలు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి..
బీహర్ నుంచి ఎందుకు వలసలు కొనసాగుతున్నాయని.. దానిని ఎందుకు నిలువరించడం లేదని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. కోటాలో చిక్కుకొన్న విద్యార్థులు, వలస కూలీలను బీహర్ ఎందుకు రానీయలేదు అని అడిగారు. శ్రీజన్ స్కాం గురించి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదన్నారు. ఆ కుంభకోణంలో పాత్రధారులు ఎన్డీఏ నేతలతో ఎందుకు తిరుగుతున్నారని అడిగారు.