చిక్కుల్లో ప్రశాంత్ కిషోర్...లాలూ నితీష్ల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నించారా...?
Recommended Video
బీహార్ : రెండో విడత లోక్సభ ఎన్నికలకు వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో బీహార్లో మరో గొడవ తెరపైకి వచ్చింది. ఈ సారి గొడవ ఆర్జేడీ జేడీయూల మధ్య కాదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరియు ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రశాంత్ కిషోర్పై తేజస్వీ యాదవ్ రబ్రీదేవీలు ఎన్నికల వేళ నిప్పులు చెరుగుతున్నారు.
జలియన్వాలాబాగ్ ఊచకోతకు 100ఏళ్లు పూర్తి: నివాళులు అర్పించిన ప్రముఖులు
తేజస్వీ వర్సెస్ ప్రశాంత్ కిషోర్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆర్జేడీ జేడీయూల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రశాంత్ కిషోర్ తెగ ప్రయత్నం చేశారన్న రబ్రీ దేవీ వ్యాఖ్యలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనతో పాటు మీడియా ముందు కూర్చోవాలని సవాల్ విసిరారు. అంతేకాదు ఇద్దరి మధ్య ఏం జరిగిందో కూడా బయటపడుతుందని అన్నారు ప్రశాంత్ కిషోర్. ఎవరు ఎవరికి ఆఫర్ ఇచ్చారు.. ఆ ఆఫర్ వివరాలు కూడా ప్రజలకు తెలుస్తాయని చెబుతూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. అవినీతి కూపంలో ఇరుక్కుపోయి అధికారాన్ని దుర్వినియోగంచేసి జైలులో ఊచలు లెక్కబెడుతున్నవారు సత్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అర్థం వచ్చేలా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
వివాదంపై నితీష్ ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
ప్రశాంత్ కిషోర్ ట్వీట్ పై కౌంటర్ అటాక్కు దిగారు తేజస్వీ యాదవ్. ఈ వివాదంపై సీఎం నితీష్ కుమార్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ నితీష్ కుమార్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని తేజస్వీ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ తమను కలుస్తున్నారని అది లాలూ పుస్తకంలో కూడా రాసి ఉందని తేజస్వీ అన్నారు. నితీష్ కుమార్ నుంచి అనుమతి తీసుకుని తర్వాత ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేయాలని అన్నారు.
లాలూతో సంధి కోసం ప్రశాంత్ కిషోర్ ప్రయత్నించారు
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రబ్రీదేవి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్తో సంధి కుదుర్చుకునేందుకు నితీష్ కుమార్ మధ్యవర్తిగా ప్రశాంత్ కిషోర్ను పంపారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రశాంత్ కిషోర్ లాలూ ప్రసాద్ యాదవ్ను ఐదు సార్లు కలిసి రెండు పార్టీలు తిరిగి ఒక్కటవ్వాలని చెప్పినట్లు రబ్రీదేవీ తెలిపారు. అంతేకాదు ఓ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిందిగా లాలూను ప్రశాంత్ కిషోర్ కోరినట్లు రబ్రీ దేవి తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఐదు సార్లు తమ ఇంటికి రాగా ఆయన్ను బయటకు గెంటేసినట్లు రబ్రీ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పచ్చి అబద్దాల కోరు అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జేడీయూకు మద్దతు తెలపాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ సంకేతాలు
లాలూ ప్రసాద్ యాదవ్ రాసిన పుస్తకం "గోపాల్ గంజ్ టూ రైసీనా"లో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆర్జేడీ పార్టీ జేడీయూకు మద్దతు తెలుపుతూ రాతపూర్వకంగా ఇవ్వాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ సంకేతాలిచ్చారని అలా జరిగితే జేడీయూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మహాగట్భంధన్లో చేరుతుందని నితీష్ మాటగా ప్రశాంత్ కిషోర్ రాయబారం నడిపారని లాలూ తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక్కడి నుంచే అసలు వివాదం ప్రారంభమైంది. ఇక లాలూపై విరుచుకుపడ్డారు బీహార్ సీఎం. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి ఫోనులో అందరితో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జైలు నిబంధనలను ఉల్లంఘించి లాలూ ఫోన్లో మాట్లాడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.