కర్ణాటక ఎఫెక్ట్: బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: గవర్నర్ కు ఆర్జేడీ వినతి
పాట్నా:బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని ఆర్జేడీ నేత, బీహర్ లో విపక్ష నాయకుడు తేజస్వియాదవ్ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కలిసి శుక్రవారం నాడు వినతి పత్రం సమర్పించారు. కర్ణాటకలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అతి పెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గవర్నర్ ను కోరారు.
కాంగ్రెస్ , హిందూస్థానీ అవామీ మోర్చా, సిపిఐ (ఎంఎల్) పార్టీలకు చెందిన నేతలు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కలిసి గవర్నర్ ను కలిశారు.సుమారు 111 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని తేజస్వీయాదవ్ ప్రకటించారు.
బీహర్ రాష్ట్ర అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆర్జేడీకి 80 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలున్నారు.హెచ్ఎఎం(ఎస్) పార్టీకి 1, సిపిఐ(ఎంఎల్) కు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీహర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యూ) కు 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బిజెపికి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.జెడి(యూ)కు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వియాదవ్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వనిస్తే, సభలో బల నిరూపణను సులభంగా గెలుస్తామని తేజస్వి యాదవ్ ధీమాను వ్యక్తం చేశారు.
తాము చెప్పిన అన్ని విషయాలను గవర్నర్ సత్యపాల్ సావధానంగా విన్నారని తేజస్వీ యాదవ్ మీడియాతో చెప్పారు. కర్ణాటకలో అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించినప్పుడు బీహర్ రాష్ట్రంలో కూడ ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు అవకాశం కల్పించరని ఆయన ప్రశ్నించారు.
మే 19వ తేదిన యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు.అయితే గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ కోరడాన్ని జెడి(యూ), బిజెపి నేతలు విమర్శించారు.