క్రికెటర్గా తేజస్వి విఫలం: లాలూ తనయుల శాఖలివే
పాట్నా: బీహార్ మంత్రి వర్గంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులిద్దరికీ కీలక శాఖలను సీఎం నితీశ్ కుమార్ అప్పగించారు. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు రహదారులు, భవనాల శాఖ అప్పగించారు.
ఇక పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. మంత్రి వర్గంలో ఎంతో కీలకమైన హోం శాఖను సీఎం నితీశ్ కుమార్ తన వద్దనే ఉంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు ప్రమాణం చేశారు. రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్లో గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. కాగా, ఇతర మంత్రి వర్గ సహచరులకు కూడా నితీష్ కుమార్ శాఖలు కేటాయించారు.
అర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక తేజస్వి యాదవ్ విషయానికి వస్తే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్, రబ్రీదేవిల చిన్న కుమారుడు. క్రికెట్ అంటే పిచ్చి. క్రికెటర్గా ఎదగాలని ప్రయత్నాలు చేసినా ఆ దిశగా సక్సెస్ కాలేదు.
జార్ఖండ్ తరపున ఒకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన తేజస్వీ, నాలుగు ట్వంటీ 20 మ్యాచ్లు ఆడాడు. 2008, 2009, 2011, 2012లో జరిగిన ఐపీఎల్లో తేజస్వికి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో స్థానం దక్కినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుడి చేత వాటం బ్యాట్స్ మెన్ అయిన తేజస్వి క్రికెట్ కెరీర్ లో అత్యధిక స్కోరు 19. కాగా బౌలింగ్ లో అతని బెస్ట్ 1/10.
దీంతో క్రీడా జీవితం సరిగా లేకపోవడంతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు. ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటి చేసి గెలుపొందాడు.