నీటిపై బాబు, కేసీఆర్ : కర్నాటకపై ఏపీ, తెలంగాణ కలిసి ఫైట్
బెంగళూరు/హైదరాబాద్: తుంగభద్రకు ఎగువన కర్నాటక మూడు భారీ పథకాలను చేపట్టడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట కూడా వాదించింది. కానీ, ట్రైబ్యునల్ తీర్పు ఇంకా అమల్లోకి రాకముందే తాజాగా కర్నాటక మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది.
దీనివల్ల తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆయకట్టుకు సమస్యలు తలెత్తడంతో పాటు శ్రీశైలంలోకి వచ్చే వరద నీటి పైనా ప్రభావం చూపే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర ఎగువ భాగంలో హవేరీ జిల్లాలో 35 టీఎంసీల సామర్థ్యంతో కొత్త జలాశయం నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కర్నాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటించారు.
దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. సామర్థ్యమే 35 టీఎంసీలు అంటే వినియోగించుకునేది ఇంకా ఎక్కువగా ఉంటుందని, ఎగువన కొత్త ప్రాజెక్టులు వినియోగంలోకి రావడంతో ఇప్పటికే నవంబరు రెండో వారం నుండి తుంగభద్రలోకి ఎలాంటి ప్రవాహమూ రావడం లేదని, ఇప్పుడు ఏకంగా భారీ జలాశయం నిర్మిస్తే మరిన్ని మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అల్మట్టి నిర్మాణం తర్వాత ఆగస్టు ఆరంభం వరకు శ్రీశైలంలోకి నీటి ప్రవాహం ఉండటం లేదు. ఎత్తు పెంపుకు ట్రైబ్యునల్ అనుమతించడం వల్ల అక్టోబర్ తర్వాత అసలు వరద నీరు వచ్చే అవకాశం లేదు. కొత్త జలాశయం నిర్మాణం శ్రీశైలంలోకి వరద నీటి ప్రవాహం పైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కలిసి కర్నాటక డ్యాం పైన పోరు సల్పే అవకాశముంది.