23ని.ల్లో..: మూజువాణితో తెలంగాణకు ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. సీమాంధ్ర ప్రాంత నేతల ఆందోళన మధ్యనే బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు బిజెపి తీరుపై సస్పెన్స్ కొనసాగినా బిల్లుకు మద్దతు పలికింది. తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామని ప్రకటించింది.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, లోకసభ ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్, తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిలు మాట్లాడారు. లోకసభలో సవరణల వారీగా ఓటింగ్ కూడా జరుగుతోందని సమాచారం.
కాగా, పార్లమెంట్లో తెలంగాణ బిల్లును చర్చకు ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు తాము సంపూర్ణంగా మద్దతిస్తామని బహుజన సమాజ్వాదీ పార్టీ (బిఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి అన్నారు. మంగళవారం పార్లమెంట్ వాయిదా అనంతరం ఆమె లోక్సభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయపూరితమైనదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాలు అత్యంత వెనుకపడ్డాయని ఆమె అన్నారు. ఉత్తర ప్రదేశ్ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి డిమాండ్ చేశారు. తాము చిన్న రాష్ట్రాలకు ఎప్పుడు అనుకూలమని, కేంద్రం యూపిని కూడా విభజిస్తే పరిపాలన సుగమం అవుతుందని ఆమె అభివర్ణించారు. మహారాష్ట్రలో కూడా విదర్భా రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయని ఆమె అన్నారు.