టిపై జవదేకర్: షో అని శీలం ఫైర్, నిల్చొని చిరు నిరసన
న్యూఢిల్లీ: సీమాంధ్రకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాల్సిందేనని, అదే సమయంలో తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ గురువారం అన్నారు. మరోవైపు తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని మరో సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. సీమాంధ్రకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోమన్నారు. అంతకుముందు జైరామ్ రమేష్తో వెంకయ్య చర్చలు జరిపారు.
బిజెపిపై జెడి శీలం ఆగ్రహం
ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ పైన కేంద్రమంత్రి జెడి శీలం గురువారం మండిపడ్డారు. తమ డిమాండ్లనే బిజెపి కాపీ కొట్టి షో చేస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలన్నారు. సీమాంధ్రుల సమస్యలపై ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎప్పుడో స్పందించి, హామీ ఇచ్చారన్నారు. పదేళ్ల పాటు ఆర్థిక ప్యాకేజీకి ఒప్పుకున్నారన్నారు. బిజెపికి సీమాంధ్ర పైన దయ ఉంటే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయమని ఎందుకు కోరడం లేదన్నారు. సీమాంధ్రులపై బిజెపిది మొసలి కన్నీరన్నారు.
కాగా, విభజన బిల్లుపై కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నారని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి సుజనా చౌదరి విమర్శించారు. వారిద్దరే బిల్లుపై మాట్లాడుకుని, చర్చలు జరుపుకుంటున్నప్పుడు వారి ఛాంబర్లోనే బిల్లు పాస్ చేసుకోవాల్సిందని, ఇక పార్లమెంటులో బిల్లు ఎందుకు పెట్టారన్నారు. రాజ్యసభలో ఈ రోజు తామిచ్చిన నోటీసులపై తొలుత చర్చ కోరుతామన్నారు.
రాజ్యసభ వాయిదా
గురువారం ఉదయం ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. తెలంగాణ అంశంతో పాటు రాజీవ్ గాంధీ అంశంపై కాంగ్రెసు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెండు సభలు పన్నెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. పన్నెండు గంటలకు రాజ్యసభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. చిరంజీవి తన స్థానంలో నిలబడి నిరసన తెలపగా, కెవిపి, సుజనా చౌదరి, సిఎం రమేష్లు వెల్లోకి వెళ్లారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. రాజీవ్ హత్య కేసులో నిందితులను విడుదల చేయాన్న తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం చట్టపరంగా నిలువదని ప్రధాని మన్మోహన్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
బిజెపిపై టి కాంగ్రెసు ఎంపీలు
తెలంగాణ బిల్లు విషయంలో బిజెపి రాజ్యసభలో ఎందుకు మాట మార్చుతోందని తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్యలు ప్రశ్నించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే బిజెపి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. చంద్రబాబుకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు.
మూడుగంటలకు టి బిల్లుపై చర్చ
రాజ్యసభలో మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే అవకాశముంది.