శ్రీరంగనాథుని సేవలో కేసీఆర్: ఫెడరల్ ఫ్రంట్ కోసం..!
చెన్నై: గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే కేరళ వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యారు. అనంతరం- డీఎంకే చీఫ్ స్టాలిన్ను కలుసుకోబోతున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆయన చెన్నైలో స్టాలిన్తో భేటీ కానున్నారు. డీఎంకే కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
స్టాలిన్తో సమావేశం కావడానికి ఆదివారం సాయంత్రమే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకున్నారు. స్టాలిన్తో సమావేశం కావడానికి సమయం ఉన్నందున..ఆయన తమిళనాడులోని ఆలయాలను సందర్శించే పనిలో పడ్డారు. చెన్నై నుంచి ఈ ఉదయం తన కుటుంబంతో సహా బయలుదేరిన కేసీఆర్.. శ్రీరంగం చేరుకున్నారు. అక్కడ కొలువైన శ్రీరంగనాథున్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ధర్మకర్తలు కేసీఆర్ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చన చేశారు. అనంతరం తీర్థ, ప్రసాదాలను అందజేశారు. అక్కడి నుంచి కేసీఆర్ మళ్లీ చెన్నైకి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు స్టాలిన్తో ఆయన నివాసంలో భేటీ అవుతారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడానికి ఏడాదికాలంగా తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా.. ఆయన పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, హెచ్ డీ కుమారస్వామిలతో సమావేశం అయ్యారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తోనూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకేలను కలుపుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
కేంద్రంలో యూపీఏ, ఎన్డీఏ కూటములకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు దక్కకపోవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో హంగ్ అంటూ ఏర్పడితే ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడి.. తమ హవాను కొనసాగించాలనేది కేసీఆర్ వ్యూహం. ఇది ఎంత వరకు ఫలిస్తుందనేది ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాతే స్పష్టమౌతుంది.