టీపీసీసీ చీఫ్ ఎంపికపై మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు.. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే...
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై గత కొద్దిరోజులుగా అటు రాజకీయ వర్గాల్లో,ఇటు సోషల్ మీడియాలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమైందని.. ఇకనైనా పార్టీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టి త్వరగా పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలని కాంగ్రెస్ అభిమానులు,మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేలాగా కనిపించట్లేదు. టీపీసీసీ ఎంపికకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. సోమవారం(డిసెంబర్ 14) మాణికం ఠాగూర్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మరికొంత సమయం పట్టే అవకాశం...
పీసీసీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకూ 162 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించినట్లు ఠాగూర్ తెలిపారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలను సేకరించామని... కింది స్థాయి నుంచి,పై స్థాయి వరకు పార్టీ శ్రేణుల అభిప్రాయాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఈ అభిప్రాయాలను త్వరలోనే అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు అందజేస్తామన్నారు. అయితే ఈ కసరత్తు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.
అభ్యంతరాలు ఉంటే...
పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పీసీసీ చీఫ్గా ఎవరైతే పార్టీని సమర్థవంతంగా నడిపించగలరని పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు కోరినట్లు చెప్పారు. అందరి అభిప్రాయాలను విశ్లేషించి.. పార్టీ అవసరాల రీత్యా సరైన నాయకుడిని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఒకవేళ పీసీసీ ఎంపిక ప్రక్రియ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా అధిష్టానాన్ని కలిసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునని చెప్పారు.
మోదీ-కేసీఆర్ భేటీపై...
ఐటీ,ఈడీ దాడుల భయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయినట్లుగా మాణికం ఠాగూర్ ఆరోపించారు. మరో ఆర్నెళ్ల వరకూ టీఆర్ఎస్ నేతలకు ఢోకా లేదన్నారు. కేసీఆర్-మోదీ భేటీ...ఢిల్లీలో దోస్తీ-గల్లీ మే కుస్తీ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వీరిద్దరి భేటీపై బండి సంజయ్,కిషన్ రెడ్డి ఏం చెప్తారో చూడాలన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలెవరూ పార్టీని వీడరని... ప్రజాదరణ లేని నేతలే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. సంస్థాగతమైన లోపాలే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఓటమికి కారణమని అన్నారు.
ఎవరికి దక్కేనో..?
టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ పదవి రేవంత్కే ఇవ్వాలని.. ఆయనైతేనే టీఆర్ఎస్,బీజేపీలను ఎదిరించగలరని సోషల్ మీడియాలో రేవంత్ మద్దతుదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీలో చాలామంది సీనియర్లు రేవంత్కు పదవిని కట్టబెట్టడంపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు లీకులు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీసీసీ రేసులో రేవంత్,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జగ్గారెడ్డి,శ్రీధర్ బాబు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో అధిష్టానం ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందన్నది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.