బహిరంగంగా ఉరితీయండి: మహిళా వైద్యురాలి ఘటనపై ఉమర్ అహ్మద్ ఇల్యాసి
న్యూఢిల్లీ/హైదరాబాద్: శంషాబాద్లో అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమామ్స్ అధిపతి ఉమర్ అహ్మద్ ఇల్యాసి తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఎక్కడ?: గేటుకు తాళం, మహిళా వైద్యురాలి ఇంటి వద్ద ఉద్రిక్తత, నేతల అడ్డగింత
గీతా ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఉమర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చారిత్రక ఎర్రకోట వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
అయోధ్య తీర్పు తర్వాత దేశంలోని హిందువులంతా ముస్లింల మనోభావాలను గౌరవించి ఎలాంటి సంబరాలు చేసుకోకుండా సోదర భావాన్ని చాటుకున్నారని ఉమర్ అహ్మద్ ఇల్యాసి వ్యాఖ్యానించారు.
మహిళా వైద్యురాలి ఘటనపై ఆగని ఆగ్రహ జ్వాలలు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా మహిళా వైద్యురాలి ఘటనపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మృతురాలి నివాసం వద్ద పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తున్నారు. నిందితులను తక్షణమే ఉరితీయాలని లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంత పెద్ద ఘోరం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల నుంచి ఎందుకు బయటకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళల భద్రతకు మేమున్నాం అనే భద్రతను ఇవ్వలేరా? అని నిలదీస్తున్నారు. ఒక ఆడపిల్లకు ఇంటి ఘోరం జరిగితే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని కార్యాలయం కూడా స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
కాగా, బుధవారం రాత్రి మహిళా డాక్టర్పై నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం నిందితులను మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు భారీ భద్రత నడుమ తరలించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ అటు షాద్ నగర్ పోలీస్ స్టేషన్.. ఇటు చర్లపల్లి జైలు వద్ద భారీగా చేరుకున్న ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు లాఠీ ఛార్జీ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.