టీ నివేదిక, డ్రాఫ్ట్ బిల్లు రెడీ: రేపే క్యాబినెట్ ముందుకు
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు, ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. అవి రేపు గురువారంనాడే మంత్రి వర్గం ముందుకు వస్తాయని ఆయన బుధవారంనాడు చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు జివోఎం సమావేశం కానున్న నేపథ్యంలో జైరాం రమేష్ ఆ విషయం చెప్పారు.
తెలంగాణ నివేదికను 25 పేజీలతో, ముసాయిదా బిల్లును 70 పేజీలతో రూపొందించినట్లు సమాచారం. ఆరు పేజీలతో క్యాబినెట్ నోట్ కూడా సిద్ధమైంది. రాయల తెలంగాణపై ఇంకా స్పష్టత రాలేదని జైరాం రమేష్ అన్నారు. బుధవారం రాత్రి జరిగేదే జివోఎం తుది సమావేశమని భావిస్తున్నారు. నిజానికి మంగళవారంనాడే తుది సమావేశం జరగాల్సి ఉంది. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం కూడా జీవోఎం సమావేశమవుతోంది.
కాగా, పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో రాదో చెప్పలేమని జివోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ బుధవారంనాడు కోల్కతాలో అన్నారు. తెలంగాణ బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంటులో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అయితే, ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు సభకు వస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
వీలైనం త్వరగా పార్లమెంటుకు తెలంగాణ బిల్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శీతాకాల సమావేశాల్లో వస్తుందని అప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై జివోఎం వేగంగా పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయన్నారు.