కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. డీకే అరుణకు బీజేపీ తీర్థం
ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కు హ్యాండిస్తున్నారు. క్రమక్రమంగా కారెక్కేస్తున్నారు. గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతుండటం.. ఆ పార్టీ పెద్దల్లో కలవరం రేపుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం చర్చానీయాంశమైంది. మరికొందరు కూడా కమలం గూటివైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అదలావుంటే రాష్ట్రంలో పువ్వుల (గులాబీ, కమలం) హవా నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది.
ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?
అటు గులాబీ.. ఇటు కమలం..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గులాబీ నేతల మాటలు నమ్మి కారెక్కొద్దని కాంగ్రెస్ పెద్దలు నచ్చజెపుతున్నా.. వలసలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. తెలంగాణ ఉద్యమం నేపథ్యం మొదలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గులాబీ జెండా హవా కొనసాగుతుండటంతో ఇతర పార్టీలకు ఉనికి లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ జోష్ మరింత పెరిగింది. ఆయా పార్టీల నేతలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారొద్దనే ఉద్దేశంతోనే.. ముందు జాగ్రత్తగా కారులో సీటు కన్ఫామ్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ మళ్లీ రాదు..! అందుకే?
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మాజీ మంత్రి, సీనియర్ లీడర్ డీకే అరుణ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరారు. మొదట్నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన డీకే అరుణ.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీలో చేరడం చర్చానీయాంశమైంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల సెగ్మెంట్ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీకే అరుణ సడెన్ గా కమల తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపికయింది.
బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు డీకే అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదన్న డీకే అరుణ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీతోనే సాధ్యమవుతుందని నమ్మి పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఇదే తోవలో మరికొందరా?
డీకే అరుణ బీజేపీలో చేరుతున్నారనే వార్త మంగళవారం హీట్ పుట్టించింది. బీజేపీ లీడర్ రాంమాధవ్ ఆమె నివాసానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంట సేపు వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం అమిత్ షా తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. పొలిటికల్ కెరీర్ పై అమిత్ షా భరోసా ఇవ్వడంతో ఆమె బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలో నిలిచే ఛాన్సుంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు డీకే అరుణ. తెలంగాణ వ్యాప్తంగా కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం కొద్దికాలంగా డీకే అరుణ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ తనను పట్టించుకోవడం లేదనే కారణంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు మరికొందరు గులాబీ వైపు.. ఇంకొందరు కమలం వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ జానారెడ్డి కుమారుడు రఘువీర్ సైతం బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి లోక్సభ ఎన్నికల పర్వం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తలనొప్పిలా పరిణమించినట్లు కనిపిస్తోంది.