బాబ్లీపై ఏపీకి ఎందుకని తెలంగాణ, మహారాష్ట్ర: హక్కుందని ఆంధ్రా
న్యూఢిల్లీ: బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిథ్యం కల్పించడం ఎందుకని, ఆ రాష్ట్రానికి ప్రాతినిథ్యం అవసరం లేదని, ఈ కమిటీతో ఆ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ, మహారాష్ట్రలు చెబుతున్నాయి. ఈ కమిటీలో ఏపీ ఉండాల్సిన అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీం కోర్టులో విన్నవించారు. మరోవైపు, మహారాష్ట్ర కూడా అదే వాదన వినిపించింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసిం ది.
అదే రోజు కమిటీలో ప్రాతినిథ్యం పైన నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. గోదావరి పైన శ్రీరాం సాగర్ ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు పైన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం న్యాయపరంగా పోరాడింది. ఈ నేపథ్యంలో 2013లోనే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఏపీ పిటిషన్ను పరిష్కరిస్తూ బాబ్లీ ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
2013 అక్టోబర్ 24న కేంద్రం కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు చైర్మన్గా, ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాల సాగు నీటి శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రాతనిథ్యం కల్పించవలసి ఉంది. మహారాష్ట్రకు తెలంగాణ సరిహద్దుగా ఉంది. దీంతో కొత్త రాష్ట్రానికి ప్రాతినిథ్యం కల్పించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధం లేదని రెండు రాష్ట్రాలు చెబుతున్నాయి.
విభజన నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు అంతా తెలంగాణ భౌగోళిక పరిధిలోకే వస్తుందని, బాబ్లీ ప్రాజెక్టు దాటి వచ్చే నీరు శ్రీరాంసాగర్లోకే చేరుతుందని, భౌగోళికంగా, న్యాయపరంగా బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో ఏపీకి ఎలాంటి హక్కులేదని తెలంగాణ చెబుతోంది.
హక్కుందని ఏపీ
గోదావరి నీటి పంపిణీ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా లేదా ప్రాంతాల వారీగా నీటి పంపిణీ పూర్తి కాలేదని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి పంపకము కూడా పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలో బాబ్లీ దాటి వచ్చి శ్రీరాంసాగర్లో కలిసే నీటి పైన ఏపీకి కూడా హక్కుందని, తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే బాబ్లీలో ప్రాతినిథ్యం ఉండాలని ఏపీ చెబుతోంది. తెలంగాణకు కమిటీలో చోటిస్తే అభ్యంతరం లేదని తెలిపింది.