భారత్ బంద్ : తెలంగాణలో రోడ్డెక్కనున్న మంత్రులు... ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం...
మంగళవారం(డిసెంబర్ 8) భారత్ బంద్ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఢిల్లీకి ఆ సెగ తాకేలా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. మరో మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్పూర్ జాతీయ రహదారిపై నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద.. ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి జిల్లాలోని టెక్రియాల్లో జరిగే నిరసనల్లో పాల్గొంటారు.
పెద్ద ఎత్తున రైతులతో...
భారత్ బంద్ నిరసన కార్యక్రమాల కోసం టీఆర్ఎస్.. రైతులను పెద్ద ఎత్తున సమీకృతం చేయనుంది. మంత్రులు,ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేయనున్నారు. మడికొండ వద్ద జాతీయ రహదారి 163పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్,సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత్ బంద్కు కార్మికులు,ఉద్యోగుల నుంచి కూడా మద్దతు లభించింది. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు,కార్మికులు కూడా బంద్లో పాల్గొననున్నారు.
బంద్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
భారత్ బంద్లో పాల్గొంటామని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ప్రకటించారు. ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సింగరేణి కార్మికులు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో 62 పారిశ్రామిక క్లస్టర్లు బంద్ పాటిస్తాయని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. బంద్కి మద్దతుగా ఆర్టీసీ కార్మికులు మధ్యాహ్నం వరకు బస్సులు నడపట్లేదు. బ్యాంకు, ఎల్ఐసీ, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు తమ కార్యాలయాల్లో గంట పాటు నిరసన చేపట్టనున్నారు. విద్యుత్ సంఘాల జాక్, ఉపాధ్యాయులు కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, భారత్ కృషక్ సమాజ్ పిలుపునిచ్చాయి.
అప్రమత్తంగా పోలీస్ శాఖ...
భారత్ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని టీఎన్జీవో సంఘం ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎన్జీవో సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసిన పోలీస్ యంత్రాంగం.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ పోలీసు అధికారులతో సోమవారం(డిసెంబర్ 6) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.