రూ.92 వేల కోట్లు కట్టాల్సిందే.. టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్.. రివ్యూ పిటిషన్ కొట్టివేత
ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మూడు ప్రముఖ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.92వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) కేసు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించుకుంది. తీర్పును రివ్యూ చేయాలంటూ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం కొట్టేసింది.
బకాయిలు చెల్లించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పుతో కంపెనీలకు ఎలాంటి అన్యాయం జరగబోదని, దానిపై సమీక్ష జరపడానికి ఒక్క సహేతుక కారణం కూడా కనిపించడం లేదంని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తాము బాకీ పడిన రూ.92వేల కోట్ల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తం బకాయిల్లో ఎయిర్టెల్ వాటానే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఆ కంపెనీ రూ.21,682.13కోట్లు బకాయి పడగా, రూ.19,823కోట్ల బకాయితో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.16,456కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.2,537కోట్లు బాకీ పడగా, ప్రభుత్వ రంగసంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా రూ.2,098కోట్ల బకాయిలు చెల్లించాల్సిఉంది. అసలు బకాయిలకు తోడు వడ్డీలు, అపరాధ రుసుములు కలుపుకొని మొత్తం ఫిగర్ రూ.92,641కోట్లకు చేరింది.