సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !
బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కీలకమైన సమాచారం సేకరించారని తెలిసింది. సీబీఐ విచారణలో ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ సంచలన వివరాలు చెప్పారని సమాచారం. అలోక్ కుమార్ నుంచి వివరాలు సేకరించిన సీబీఐ మరి కొంత మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యిందని తెలిసింది. సుమారు 600 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని సమాచారం.
బెంగళూరు మాజీ సీఎస్
బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ను గురువారం సీబీఐ అధికారులు విచారణ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్న సుమారు 20 మంది సీబీఐ అధికారులు ఎంజీ రోడ్డు, జాన్సన్ మార్కెట్ సమీపంలోని అలోక్ కుమార్ ఇంటిలో సుమారు 8 గంటల సేపు ఆయన్ను విచారణ చేశారు. పూర్తి వివరాలు సేకరించాలని సీబీఐ అధికారులు భావించారు.
600 మంది పోన్లు ట్యాపింగ్ !
అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తి ఆదేశాల మేరకు సుమారు 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, మఠాధిపతులు, మంత్రులు, శాసన సభ్యులు, ఎమ్మెల్యేల పీఏలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని శాఖల సీనియర్ అధికారులు, విలేకరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు మొత్తం 600 మంది ప్రముఖ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని కొందరు సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మొదట రౌడీల ఫోన్లు
మొదట రౌడీల ఫోన్లు ట్యాపింగ్ చెయ్యాల్సి వచ్చిందని సీబీఐ అధికారుల ముందు అలోక్ కుమార్ చెప్పారని తెలిసింది. రౌడీలు కొందరు రాజకీయ ప్రముఖులు, మంత్రులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో వారి ఫోన్లు ట్యాపింగ్ చెయ్యాల్సి వచ్చిందని అలోక్ కుమార్ సీబీఐ ముందు చెప్పారని తెలిసింది. అయితే సీబీఐ అధికారులు మాత్రం ఈ వివరాలు ఏ మాత్రం బయటకురాకుండా చూస్తున్నారు.
ప్రముఖ వ్యక్తి ఎవరు ?
సంకీర్ణ ప్రభుత్వంలోని ఓ ప్రముఖ వ్యక్తి సూచన మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశామని అలోక్ కుమార్ సీబీఐకి చెప్పారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అయితే ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు ? అనే విషయం మాత్రం బయటకురాలేదు. ఓ ప్రముఖ మఠాధిపతికి చెందిన ఫోన్ గత ఆరు నెలల నుంచి ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ మఠం ఏది ? ఆ మఠాధిపతి ఎవరు అనే విషయం మాత్రం బయటకురావడం లేదు.
సీబీఐ పక్కాప్లాన్
ఫోన్ల ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సీబీఐ సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ను మరింత విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యిందని తెలిసింది. అయితే ఆవేశంతో అలోక్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించలేకపోతే ఆయన న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉందని, మొదటికే మోసం వచ్చి దర్యాప్తు పక్కదోవపట్టే అవకాశం ఉందని సీబీఐకి చెందిన కొందరు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసింది. పక్కా సమాచారం, ఆధారాలు సేకరించిన తరువాత ఎవరినైనా అరెస్టు చెయ్యడానికి అవకాశం ఉంటుందని, అంత వరకు వేచి చూడాలని సీబీఐ వర్గాలు నిర్ణయించాయని తెలిసింది.