మరో 12 రోజుల్లో పెళ్లి.. వుహన్లో యువతి, శిక్షణ కోసం వెళ్లి అక్కడే చిక్కి, తల్లిదండ్రుల ఆందోళన...
మరో 12 రోజుల్లో పెళ్లి.. ఇటీవల నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్లి కుమారుడు ఓకే.. కానీ పెళ్లి కూతురు మాత్రం విదేశంలో చిక్కుకొంది. అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న సమయానికి రావొచ్చు కానీ ఆమె బందీగా మారింది కరోనా వైరస్ వ్యాపించిన చైనాలోని వుహన్లో.. దీంతో అక్కడ ఆమె, ఇక్కడ ఆమె పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తమ కూతురిని స్వదేశం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖను కోరుతున్నారు.
వుహన్లో..
కర్నూలు జిల్లా ఈరలపాడుకు చెందిన యువతి శృతి. ఉన్నత చదువు చదివి.. టీసీఎల్ కంపెనీలో కొలువు సంపాదించింది. కంపెనీ వారు ట్రైనింగ్ కూడా ఇస్తోన్నారు. జీవితంలో సెటిల్ అవుతున్నానని.. ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. ముహూర్తం చూసి ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి ఖరారు చేశారు. కానీ ఇంతలోనే శృతి వుహన్లోని ఉండిపోయారు. కారణం ఆమెకు జ్వరం ఉండటంతో.. ఇండియా పంపించేందుకు అక్కడి అధికారులు అంగీకరించకపోవడమే.
రెండు విమానాల్లో కూడా..
శనివారం ఎయిర్ ఇండియా విమానం వుహన్ వెళ్లి 300 పైచిలుకు భారతీయ విద్యార్థులను ఢిల్లీ తీసుకొచ్చింది. వారిని ఢిల్లీ సమీపంలోని మనేసర్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు ఆదివారం కూడా 323 మంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ తరలించింది. ఈ రెండు విమానాల్లో ఇండియా వచ్చేందుకు శృతి ప్రయత్నించారు. కానీ ఆమెకు వైరస్ ఉందని చెప్పి.. ఆమెను అక్కడే నిలిపివేశారు. దీంతో శృతి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తనకు వైరస్ లేదని ఓ వీడియోను పేరెంట్స్కు పోస్ట్ చేశారు. అందులో తన గోడును వెల్లబోసుకున్నారు.
37 డిగ్రీల టెంపరేచర్
తనకు వైరస్ సోకలేదని శృతి స్పష్టంచేశారు. ప్రయాణించడం, పని ఒత్తిడి టెంపరేచర్ ఉందని.. 37 డిగ్రీలు రావడంతో తనను నిలిపివేశారని చెప్పారు. అవసరమనుకుంటే కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలని కోరారు. అంతే తప్ప తనకు వైరస్ ఉందని చెప్పడం సరికాదన్నారు. శృతి సహా 58 మంది శిక్షణ కోసం వచ్చారు. అయితే అందరినీ వెనక్కి పంపించేందుకు తనను ఒక్కరిని నిర్బందించారని శృతి వాపోయారు. శిక్షణ ముగించుకొని వచ్చే సమయంలో అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
పెళ్లి
శృతికి ఇటీవలే నిశ్చితార్థం కూడా అయ్యింది. ఈ నెల 14న వివాహం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వుహన్లో శృతి చిక్కుకోవడంపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఇండియా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే వివాహానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశామని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ, చైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇండియా తీసుకురావాలని కోరారు. తమ పాప వుహన్లో చిక్కుకుపోవడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీసీఎల్ కంపెనీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.