మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు: అక్కడ గెలవాలంటే.. మనోళ్లు దయ తల్చాల్సిందే!
ముంబై: మహారాష్ట్రలోని షోలాపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. షోలాపూర్ సిటీ సహా చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తే.. తెలంగాణలో కలియ తిరిగినట్టు ఉంటుంది. సిరిసిల్ల తరహాలో మగ్గం చప్పుళ్లు షోలాపూర్ లో వినిపిస్తుంటాయి. తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తుంటాయి. ఎవ్వర్ని పలకరించినా తెలుగులోనే మాట్లాడతారు. తెలంగాణ యాసలో ఆప్యాయంగా పలకరిస్తారు.
షోలాపూర్ లో స్థిరపడిన తెలుగు వారిలో సుమారు 80 శాతం మంది పద్మశాలీయులే. షోలాపూర్ దుప్పట్ల గురించి మనకు తెలుసు. వాటి తయారీలో తెలుగు వారి పాత్ర కీలకం. షోలాపూర్ సహా చుట్టు పక్కల అనేక వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నాయి. వాటిల్లో చాలామంది తెలుగు ప్రజలు పనిచేస్తుంటారు. వాటికి అనుబంధంగా ఏర్పాటైన పలు చిన్న తరహా కార్ఖానాలను సొంతంగా నడిపిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు తెలుగు ప్రజలు. ఏకంగా మూడు లక్షల మందికి పైగా ఉన్నారు. వారందరికీ అక్కడ ఓటు హక్కు ఉంది.
ఫలితాలను తారుమారు చేయగల సత్తా మనోళ్లకే..
కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది షోలాపూర్. ఫలితంగా- కన్నడిగులు కూడా షోలాపూర్ స్థిరపడినప్పటికీ.. తెలుగు వారి సంఖ్యే అధికం. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా సరే! ఎన్నికల్లో గెలవాలంటే మరాఠాల కంటే తెలుగు ఓటర్ల మీదే ఎక్కువగా ఆధారపడతారు. తెలుగువాళ్లు దయతలిస్తే గెలిచిపోతామనుకునే ధీమా వారిలో కనిపిస్తుంటుంది. అందుకే- మనోళ్ల ఓటుబ్యాంకును భద్రంగా కాపాడుకుంటారు. తెలుగు సంఘాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంటారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ ధైర్యం ఇస్తుంటారు. జీవనోపాధి కోసం సుమారు- 175 ఏళ్ల కిందటే తెలుగు ప్రజలు షోలాపూర్ కు వలస వెళ్లారు. షోలాపూర్ తోపాటు నాందేడ్, జాల్నా, పుణె, భివండీ వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడ ఏర్పాటైన వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వాటికి అనుబంధంగా కొందరు తెలుగు ప్రజలు సొంతంగా పవర్ లూమ్స్ ను ఏర్పాటు చేశారు.
ముందు నుంచీ కాంగ్రెస్ వెంటే..
తెలుగు ఓటర్లు మెజారిటీ సంఖ్యలో కాంగ్రెస్ కు జై కొట్టేవారని తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే సొంత నియోజకవర్గం షోలాపూర్. మూడుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇదివరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. తెలుగువారితో ఆయనకు అనుబంధం ఎక్కువ. దీన్ని ఆధారంగా చేసుకుని చాలాకాలం పాటు సుశీల్ కుమార్ షిండే వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయన జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
బీజేపీకి చెందిన శరద్ బంద్ చౌడె ఇక్కడ గెలుపొందారు. ఈ సారి కూడా సుశీల్ కుమార్ షిండే కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి జై సిద్ధేశ్వర్ శివాచార్య స్వామి, వంచిత్ బహుజన్ అఘాడీ నుంచి బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ బరిలో నిలిచారు. సుశీల్ కుమార్ షిండే తెలుగువారిలో సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని చెబుతూ ప్రచారం సాగిస్తున్నారు. తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారు.