విప్లవ కవి వరవర రావుకు స్వేచ్ఛ: అర్ధరాత్రి విడుదల: అయినా అక్కడే
హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు బెయిల్పై విడుదలయ్యారు. శనివారం రాత్రి 11:45 నిమిషాలకు ఆయనకు స్వేచ్ఛ లభించింది. భీమా కోరేగావ్ కేసులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ముంబైలోని తలోజా జైలులో గడిపారు. వరవర రావు వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ మావన హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు బోంబే హైకోర్టులో పలు పిటీషన్లు వేశారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కిందటి నెల ఆయనకు ఆరు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో శనివారం రాత్రి ఆయన విడుదలయ్యారు. విడుదలయ్యే సమయంలో ఆయన నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బోంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం వల్ల ఆయన ముంబైలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కు రాకపోవచ్చని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆయనను కలుసుకోవడానికి వీలున్నట్లు సమాచారం. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారికి బెయిల్ లభించడం ఇదే తొలిసారి.
Free at last ! Varavara Rao out of Nanavati hospital 11.45 pm, 6th March 2021 pic.twitter.com/e3s0jZNqeM
— Indira Jaising (@IJaising) March 6, 2021
వరవర రావు విడుదలైన విషయాన్ని ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త ఇందిరా జైసింగ్ ధృవీకరించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. నానావతి ఆసుపత్రి నుంచి వరవర రావు విడుదలయ్యారని పేర్కొంటూ ఆయన తాజా ఫొటోను పోస్ట్ చేశారు. వరవర రావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటీషన్లపై ఆమె వాదించారు. ఏడాది కాలం పాటు ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోన్నారని, మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని బోంబే హైకోర్టులో తన వాదనలను వినిపించారు. ఈ ఏడాదిలో 149 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే గడిపిన విషయాన్ని ప్రస్తావించారు.
మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారంటూ ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్, భీమా కోరేగావ్ కేసులో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 81 సంవత్సరాల వయోధిక వృద్ధుడైన వరవర రావు ఇదివరకు విచారణ ఖైదీగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయనకు కరోనా వైరస్ కూడా సోకింది. నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. విడుదలయ్యే సమయానికి ఆయన అక్కడే ఉన్నారు.