శనిశింగాపురంకు 'తిరుమల' పరిష్కారం: శ్రీశ్రీ రవిశంకర్
పుణే: మహారాష్ట్రలోని శనిశింగాపురం ఆలయంలోకి మహిళలకు అనుమతి లేదు. ఇది ఇటీవల వివాదం అయింది. దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. రెండు ప్రతిపాదనలను అతను ముందుంచారు.
శని శింగనాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదానికి పరిష్కారం సూచించినట్లు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం తెలిపారు. తిరుపతి శ్రీవారి ఆలయం తరహాలో శనీశ్వరాలయం గర్భ గుడిలోకి అర్చకులను తప్ప పురుషులు, మహిళలు ఎవరిని కూడా అనుమతించ కూడదని ఆయన ప్రతిపాదించారు.
అయితే ఈ సూచనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సముచిత నిర్ణయం వెలువరించాలని ఉద్యమకారిణి, భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. శ్రీశ్రీ రవిశంకర్ ఈ అంశంపై ఆదివారం ఆలయ ధర్మకర్తలు, ఉద్యమకారిణి తృప్తితో వేరువేరుగా సమావేశమయ్యారు.
అనంతరం మాట్లాడారు. భక్తులకు దర్శనానికి తిరుపతి శ్రీవారి ఆలయం నమూనాను పరిష్కారంగా ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేసిన తృప్తి దేశాయ్.. ముఖ్యమంత్రి నుంచే సముచిత నిర్ణయం రావాలన్నారు.
భవిష్యత్తులో గర్భగుడిలోకి మహిళలు, పురుషులు ఎవరిని అనుమతించనట్లైతే, శ్రీశ్రీ రవిశంకర్, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో గర్భగుడిలో చివరి పూజ నిర్వహించే అవకాశం భూమాత బ్రిగేడ్ కార్యకర్తలకు ఇవ్వాలన్నారు. మరోవైపు, శని శింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించాలని సాధ్వీ రితంభర పేర్కొన్నారు.