రామమందిరంకు కౌంటర్: అధికారంలోకి వస్తే విష్ణుమూర్తి పేరుతో నగరాన్ని నిర్మిస్తామన్న అఖిలేష్
సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే భగవంతుడైన విష్ణుమూర్తి పేరుతో ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఛీఫ్ ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఆ ఆలయం కూడా కంబోడియాలోని అంకోర్వత్ ఆలయంను పోలి ఉంటుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చట్టపరమైన పద్దతుల ద్వారానే నిర్మిస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గతవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో అఖిలేష్ విష్ణుమూర్తి పేరుతో నగరం అభివృద్ధి చేస్తామని చెప్పడం విశేషం.
"మేము విష్ణుమూర్తి పేరుతో 2వేల ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తాం. ఇటావాలోని లయన్ సఫారీ ప్రాంతంలో ఈ నిర్మాణం చేపడతాం. చంబల్ పరిసర ప్రాంతాల్లో మనకు చాలా భూమి ఉంది.అక్కడ విష్ణు ఆలయం నిర్మిస్తాం. ఆ ఆలయం కంబోడియాలోని అంకోర్వత్ ఆలయాన్ని పోలి ఉంటుంది." అని అఖిలేష్ తెలిపారు. అంతకుముందు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అవసరమైతే పార్లమెంటులో బిల్లును తీసుకొస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. తమ పార్టీకి రెండు సభల్లో సంఖ్యా బలం ఉన్నందున తప్పకుండా పాస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు మౌర్య.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే లోక్సభలో పాస్ అవుతుంది కానీ రాజ్యసభలో మాత్రం సంఖ్యాబలం లేనందున బిల్లు పాస్ కాదని మౌర్య చెప్పారు. ఇది ప్రతి రామభక్తుడికి తెలుసని.. త్వరలోనే రామమందిరం నిర్మాణంపై కోర్టు తీర్పు వస్తుందని మౌర్య వెల్లడించారు. ఇదిలా ఉంటే సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే విష్ణమూర్తి పేరుతో నగరం తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇచ్చిన అఖిలేష్.. నగరం ఎలా ఉండాలనేదానిపై కొందరి నిపుణులను కంబోడియాకు పంపి అక్కడి నిర్మాణాన్ని స్టడీ చేశాకా అలాంటి నగరాన్నే యూపీలో నిర్మిస్తామని అఖిలేష్ చెప్పారు. ప్రపంచంలోని ఆలయాల్లో అంకోర్వత్ అత్యంత పెద్దది. ముందు విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డ ఈ ఆలయం కాలక్రమంలో బౌద్ధుల ఆలయంగా రూపాంతరం చెందింది.
బీజేపీపై ఎదురు దాడి చేసిన అఖిలేష్... బీజేపీ కేవలం మాటలకే పరిమితమైందని నిప్పులు చెరిగారు. బీజేపీ కుట్రలు చేయడంలో దిట్ట అని... తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో దిట్ట అని అఖిలేష్ చెప్పాడు. మేము చేయబోయే అభివృద్ధి ప్రజలకు వివరించాకే ఓట్లు అడుగుతామని అఖిలేష్ చెప్పాడు. ప్రజలు బీజేపీతో విసిగివేశారిపోయారని 2019లో కేంద్రం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారని అఖిలేష్ అన్నారు. వచ్చె నెల నుంచి తాను కనౌజ్ నుంచి హక్ ఔర్ సమ్మాన్ పేరుతో సైకిల్ యాత్ర చేయనున్నట్లు అఖిలేష్ వెల్లడించారు.