బీజేపీ కొత్త స్ట్రాటజీ: బూత్ పరధిలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో లెక్కపెట్టండి
న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా లేదు. తాజాగా ఆయా పోలింగ్ బూతుల పరధిలోకి వచ్చే ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయో లెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాదు స్థానికంగా ఏ కులాలు ఎక్కువగా ఉన్నాయో అనే అంశంపైనా సమాచారం సేకరిస్తోంది కమలం పార్టీ.
హిందూ ఆలయాల ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తాయని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల సమయానికి ఆ ఆలయాల్లో పనిచేసే ప్రధాన వ్యక్తులు కొన్ని ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రతి ప్రాంతంలో ఆలయాలకు చెందిన పెద్ద మనుషులు, లేదా ఆలయ పూజారులు ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతారని భక్తులను వారు తమవైపు తిప్పుకోగలరని కమలనాథులు భావిస్తున్నారు. అలాంటి పూజారులను మచ్చిక చేసుకోగలిగితే సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తలుస్తున్నారు.
ఈ కొత్త వ్యూహంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన రాజకీయ మెదడుకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం సేకరిస్తున్న సమాచారం ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తులనే కాకుండా... ఆ ప్రాంతంలో మతం ఏమేరకు ప్రభావం చూపుతోందో అన్న ఐడియా పార్టీకి ఉంటుందని భావిస్తున్నారు. విపక్షాలు బీజేపీని ఓడించేందుకు ఒక్కటవుతున్న సమయంలో కమలం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ మతతత్వ రాజకీయాలకు పూనుకుంటోందని విపక్షాలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. బీజేపీ బ్రాహ్మణ -బానియా పార్టీగా ముద్రవేసుకున్నప్పటికీ ఇతర కులాల వారిని కూడా మోడీ పాపులారిటీతో తమవైపు తిప్పుకుంది. ఇదే ఫార్ములాను 2014 ఎన్నికల్లో బీజేపీ వినియోగించింది.
ఆలయాల సమాచారం సేకరణతో పాటు ప్రతి బూత్ పరిధిలో బైకు నడపగలిగే ఐదుగురు యువకులను నియమిస్తోంది. ఐదు వాట్సాప్ గ్రూపులు, ప్రభుత్వ పథకాలతో లబ్ధపొందిన ఐదుగురు, ఎన్జీఓలు, స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ప్రతి బూతుకు నియమిస్తోంది. అంతేకాదు అక్కడక్కడ తమ పార్టీ గుర్తు కమలం పువ్వును గోడలపై పెయింట్ చేసేలా చర్యలు తీసుకుంటోంది బీజేపీ.