సీఎం చెప్పారంటే: ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ మధుబనిలోని ఓ గుడికి వచ్చాక గుడిని శుద్ధి చేశారని చెప్పడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలన్నారు. అంటరానితనం నేరమని, సాధారణ పౌరుల విషయంలోనే అలాంటి ప్రవర్తన సిగ్గుచేటు అన్నారు.
అలాంటిది ఒక ముఖ్యమంత్రి తాను వెళ్లి వచ్చాక గుడిని శుద్ధి చేశారని చెప్పడం అత్యంత సిగ్గుపడాల్సిన విషయమన్నారు. పోలీసులు వెంటనే విచారణ జరిపి కారకులను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
కాగా, తాను ఓ దేవాలయాన్ని దర్శించుకున్నందుకు ఆ దేవాలయాన్ని కడిగి శుభ్రం చేశారని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ వెల్లడించారు. దీనికి కారణం తానొక దళితుడు కావడమేనని తెలిపారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల అనంతరం మధుబన్ జిల్లాలోని ఓ దేవాలయానికి వెళ్లిన తనకు ఈ అనుభవం ఎదురైందని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బోలా పాశ్వాన్ శాస్ర్తి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాంఝీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
దళితులకు, వెనుకబడిన కులస్థులకు వ్యతిరేకంగా కొన్ని వర్గాల్లో తీవ్రమైన వివక్ష ఉందని తెలిపారు. పని నెరవేర్చేకోవడం కోసం అగ్రవర్ణాల వారు అవసరమైతే తన పాదాలు కూడా పట్టుకుంటారని, తానొక దళితుడనని తెలిసినా వారు దీనికి వెనుకాడరని మాంఝీ విమర్శించారు.
మహా దళితుల పట్ల వర్ణ వివక్ష లోతుగా పాతుకుపోయి ఉందని, తాను కూడా దాని బాధితుడేనని ఆయన చెప్పుకున్నారు. దేవాలయంలో జరిగిన సంఘటన తనకు తెలియదని, దాని గురిచి గునులు, జియాలజీ శాఖల మంత్రి రామ్ లషన్ రామ్ రామన్ తనకు చెప్పారని ఆయన అన్నారు. అధికార యంత్రాంగంలో కూడా దళితుల పట్ల వివక్ష ఉందని, అది బలహీనవర్గాలకు చెందిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో ఆటంకం కల్పిస్తోందని ఆయన అన్నారు.