మహిళా దినోత్సవం రోజు మహిళలకు బంపరాఫర్... ప్రకటించిన సీఎం జగన్.. అదొక్కటే కండిషన్...
ఈ నెల 8వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు బంపరాఫర్ ప్రకటించారు. ఆరోజు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ప్రకటించారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన మొబైల్ షాపుల్లో మహిళలు రాయితీ పొందవచ్చునని తెలిపారు. అయితే మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నవారికే రాయితీ వర్తిస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంగన్వాడీల్లో నాడు-నేడు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకాలపై గురువారం(మార్చి 4) క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
Recommended Video
మహిళల భద్రత, సంక్షేమం, అభివృద్దికి సంబంధించి పలు కీలక అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7న రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్తో 2000 స్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన షాపుల్లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలపై నేరాలను అరికట్టడంలో భాగంగా రూపొందించిన దిశ యాప్ ప్రమోషన్కు కూడా ఈ ఆఫర్ కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దిశ యాప్కు సంబంధించిన హోర్డింగులను కాలేజీల వద్ద ఏర్పాటు చేయాలని సమీక్ష సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 లక్షల మంది దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించి 154 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు.మహిళలు, బాలలపై నేరాల్లో 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందుకు తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారని చెప్పారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలకు కూడా సీఎం జగన్ శుభవార్త చెప్పడం విశేషం. విమెన్స్ డే రోజు వారికి సెలవు ప్రకటించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆరోజు ప్రతీ విభాగంలో ఎంపిక చేసిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని ఆదేశించారు.మహిళా ఉద్యోగులకు అదనంగా మరో 5 క్యాజువల్ లీవ్స్కు అనుమతినిచ్చారు.రాష్ట్రంలో మహిళల కోసం అమ్మ ఒడి,చేయూత వంటి పథకాలను ఇప్పటికే ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు పైనే రిజిస్ట్రేషన్లు చేస్తోంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో 56శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.