వాటర్ బిల్లు డీఫాల్టర్లలో టెండూల్కర్, బాల్ థాకరే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరపాలక సంస్థ వాటర్ బిల్లు డీఫాల్టర్లలో జాబితాలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు చోటు చేసుకుంది. ఆయనతో పాటు సమాజ్వాదీ పార్టీకి చెందిన అబూ అజ్మీ, బాల్ థాకరే పేర్లు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎఆర్ ఆంతులే కుటుంబ సభ్యులు కూడా డీఫాల్టర్లలో ఉన్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ ఏడాది జనవరి 16వ తేదీ ప్రకారం బిఎంసి 2 లక్షల మంది నుంచి వేయి కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వసూలు చేయాల్సి ఉంది. రాష్ట్ర సమాచార కమీషనర్ ఆదేశాల మేరకు ఆ జాబితాను బిఎంసి ఇటీవల తన వెబ్సైట్లో పెట్టింది.
డిఎన్ఎ వార్తాకథనం ప్రకారం - రావాల్సిన సొమ్మును బట్టి చర్యలు తీసుకుంటామని బిఎంసి అధికారులు అటున్నారు ప్రతి బిల్లింగ్ సైకిల్ సందర్భంగా వంద లేదా 500 మంది టాప్ డిఫాల్టర్ల జాబితా తయారు చేస్తామని, జాబితాలో ఉన్నవారెవరైనా వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పలుసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ టెండూల్కర్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య కాంటాక్టులోకి రాలేదని అంటున్నారు. ఆజ్మీ మాత్రం తాను చెల్లించామని, బకాయిలు లేవని అన్నారు.