ఆపరేషన్ బ్లూస్టార్కు 35ఏళ్లు.. అమృత్సర్లో హై టెన్షన్.. స్వర్ణ దేవాలయం వద్ద భద్రత కట్టుదిట్టం..
అమృత్సర్ : పంజాబ్ అమృత్సర్లో హై టెన్షన్ నెలకొంది. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కొందరు వ్యక్తులు నానా రభస చేశారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నిర్వహించిన ప్రోగ్రాంలో మిలిటెంట్ లీడర్ జర్నైల్ సింగ్ బింద్రావాలే ఫొటోలతో కూడిన టీషర్టులు ధరించిన కొందరు సిక్కులు ఖలిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేశారు.
భద్రత కట్టుదిట్టం
ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని ముందే గ్రహించిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టాస్క్ ఫోర్స్ భద్రత కట్టుదిట్టం చేసింది. గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3వేల మంది భద్రతా సిబ్బంది, పోలీసులు డేగ కన్నుతో పహరా కాస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల వివరాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
నిరసన ప్రదర్శనలు
ఆపరేషన్ బ్లూస్టార్ సందర్భంగా అమృత్సర్లో పలుచోట్ల సిక్కుల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ప్రతి అంగుళాన్ని సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లలో భద్రత పెంచడంతో పాటు సిటీలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్లరిమూకలు నగరంలోకి ప్రవేశించకుండా నగరంలోకి వచ్చే ప్రతివాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని అకాళీ తక్త్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీలు విజ్ఞప్తి చేశాయి.
ఇందిరా హయాంలో ఆపరేషన్ బ్లూస్టార్
స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టారు. 1984 జూన్ 1 నుంచి 8వ తేదీ మధ్య జరిగిన ఈ ఆపరేషన్లో అనేక మంది సిక్కు మిలిటెంట్లతో పాటు సైనికులు, పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. తుపాకీ గుళ్ల కారణంగా స్వర్ణదేవాలయం దెబ్బతింది.